బిడ్డకు జన్మనిచ్చిన మూడు రోజులకే-మృత్యు ఒడిలోకి తల్లి-'కరోనా' భయంతో ముఖం చాటేసిన భర్త
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ నిత్యం వేలాది మందిని బలితీసుకుంటోంది. పసిబిడ్డలు మొదలు వృద్దుల వరకూ ఎంతోమంది కరోనా కాటుకు బలవుతున్నారు. కరోనా సోకిందంటే చాలు... అయినవాళ్లే దగ్గరికి వెళ్లేందుకు జంకుతున్నారు. కొన్నిచోట్ల కరోనా పేషెంట్ల పట్ల కుటుంబ సభ్యులే అమానవీయంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. బిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళ కరోనాతో కన్నుమూయగా... ఆమె భర్త కనీసం అటువైపు తొంగి చూడలేదు.
అసలేం జరిగింది...
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలకు చెందిన చెంగల శ్రీనివాస్-సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఝాన్సీ, మౌనిక (21). గత ఏడాది చిన్న కుమార్తె మౌనికకు వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన పాముల సురేందర్తో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. పెళ్లయిన కొద్దిరోజులకే గర్భం దాల్చిన మౌనిక ఇటీవల ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. ఇదే క్రమంలో ఈనెల 8న మౌనికకు జ్వరం వచ్చింది. మందులు వాడటంతో రెండు రోజుల్లో తగ్గిపోయింది. అయితే ఆ తర్వాత రెండు రోజులకే మళ్లీ జ్వరం వచ్చింది. కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్దారణ అయింది.
ఆడ శిశువుకు జన్మనిచ్చిన మౌనిక..
కరోనా పాజిటివ్గా తేలినప్పటి నుంచి మౌనిక హోమ్ ఐసోలేషన్లో ఉంటోంది.శనివారం (మే 22) మౌనికకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబ సభ్యులు వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చింది. సోమవారం మౌనికకు పురిటి నొప్పులు రావడంతో సీకేఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శస్త్ర చికిత్స చేయగా మౌనిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
తొంగి చూడని భర్త...
బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది గంటలకే మౌనిక ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆక్సిజన్ ఫ్లో మీటర్ తీసుకురావాలని మౌనిక తండ్రికి వైద్యులు సూచించగా ఆయన మెడికల్ షాపు వద్దకు వెళ్లారు. ఆయన తిరిగొచ్చే లోపే మౌనిక మృతి చెందింది. చేతుల్లో పసికందును ఎత్తుకుని... కళ్లెదుట బిడ్డ మృతదేహాన్ని చూసి మౌనిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మౌనిక భర్తకు ఆమె చనిపోయిందని సమాచారమిచ్చినా అతను అక్కడికి వెళ్లలేదు. కనీసం అంత్యక్రియలకు కూడా వెళ్లలేదు. కట్టుకున్నోడు ఇంత కర్కషంగా వ్యవహరించడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు మరింత గాయపడ్డాయి.
మరో ఘటనలో మరో బాలింత మృతి
మరో ఘటనలో జనగామ జిల్లాకు చెందిన వంశీప్రియ అనే యువతి బిడ్డకు జన్మనిచ్చిన మూడు రోజులకే కన్నుమూసింది. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆమెను మొదట జనగామలోని ఎంసీహెచ్కు తరలించారు. అక్కడినుంచి హన్మకొండ ఆస్పత్రికి... అక్కడినుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం వంశీప్రియ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె తల్లిదండ్రులు,భర్త కన్నీరుమున్నీరుగా విలపించారు.
Recommended Video