షర్మిల మెడకు 'జల జగడం'-ఇంటిని ముట్టడించిన అమరావతి జేఏసీ-జగన్పై పోరాడాలన్న ఇందిరా శోభన్
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న 'జల జగడం' వైఎస్ షర్మిల మెడకు చుట్టుకుంది. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా,పనినైనా అడ్డుకుని తీరుతామని ఇటీవల షర్మిల స్పష్టం చేయడంతో ఏపీ వాసులు మండిపడుతున్నారు. షర్మిల ప్రకటనను వ్యతిరేకిస్తూ తాజాగా అమరావతి జేఏసీ హైదరాబాద్ లోటస్పాండ్లోని ఆమె ఇంటిని ముట్టడించింది. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ కొలికిపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో షర్మిల ఇంటిని ముట్టడించారు.
శ్రీనివాసరావు అరెస్ట్...
ముట్టడి సందర్భంగా అమరావతి జేఏసీ కార్యకర్తలకు వైఎస్ షర్మిల పార్టీ మద్దతుదారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
వాగ్వాదం సందర్భంగా తెలంగాణ వ్యతిరేకుల్లారా ఖబడ్దార్ అంటూ షర్మిల పార్టీ కార్యకర్తలు శ్రీనివాసరావును హెచ్చరించారు. శ్రీనివాసరావు చంద్రబాబు తొత్తు అని విమర్శించారు. మరోవైపు శ్రీనివాసరావు మాట్లాడుతూ... కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రతీ అక్రమ కట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఏపీకి అన్యాయం చేసే ఆ ప్రాజెక్టులకు మద్దతునిస్తున్న షర్మిల విధానాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని... అందుకే ఆమె ఇంటి ముట్టడి చేపట్టామని తెలిపారు.
జగన్పై పోరాటం చేయండి...
వైఎస్ షర్మిల పార్టీకి చెందిన మహిళా నేత ఇందిరా శోభన్ మాట్లాడుతూ... తెలంగాణ హక్కుల కోసం ఎవరితోనైనా, ఎంతటివాడితోనైనా కొట్లాడుతానని షర్మిల గతంలోనే చెప్పారన్నారు. ఖమ్మం సంకల్ప సభలో షర్మిల చేసిన వ్యాఖ్యలనే ట్విట్టర్లో పెట్టామన్నారు. రాయలసీమకు,ఆంధ్రా వాళ్లకు నీళ్లు ఇవ్వొద్దని తామెక్కడా చెప్పలేదన్నారు. తెలంగాణ అన్యాయం జరిగితే కచ్చితంగా పోరాడుతామన్నారు. అమరావతి జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరావు ఏపీ సీఎం జగన్పై పోరాటం చేయాల్సింది పోయి షర్మిల ఇంటిని ముట్టడించమేంటని ప్రశ్నించారు. ఎవరు పంపిస్తే ఆయన ఇక్కడికి వచ్చారో అందరికీ తెలుసన్నారు. ఇకనైనా శ్రీనివాసరావు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
జల జగడంపై చిక్కుముడి...
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది నీటి పంపకాలపై తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మీరంటే మీరు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఇరు రాష్ట్రాలు నిందించుకుంటున్నాయి. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని తెలంగాణ వాపోతుండగా... తమ ప్రాజెక్టులను అడ్డుకుంటే రాయలసీమ ఎడారిగా మారుతుందని ఏపీ వాపోతోంది. ఎవరికి వారు తమదే సరైన వాదన అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. దీంతో ఈ చిక్కుముడి ఎలా వీడుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.