నాకంత లేదు, మోడీతో బాగుంటాం: కేటీఆర్, హైద్రాబాద్ను వైఫై చేస్తాం: దత్తాత్రేయ
హైదరాబాద్: తాము కేంద్రంతో గొడవలను కోరుకోవడం లేదని, సఖ్యతతోనే వ్యవహరిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు చెప్పారు. పార్టీ వేదికల పైన విమర్శలు వేరు, ప్రభుత్వాల మధ్య సంబంధాలు వేరు అని అభిప్రాయపడ్డారు.
మున్సిపల్, ఐటీ శాఖ విషయమై కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దత్తాత్రేయ - కేటీఆర్లు ఒకరి పైన మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సఖ్యతగానే ఉంటాయని, పార్టీలు వేరు అని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నారని, తెలంగాణలో కేసీఆర్ గెలిచారని, నిధుల విషయంలో బీజేపీ నేతల వ్యాఖ్యలు, తమ స్పందన సాధారణమే అని చెప్పారు.
దత్తాత్రేయను విమర్శించే స్థాయి నాది కాదని కేటీఆర్ అన్నారు. ఐటీఐఆర్ పైన కేంద్రానికి నివేదిక ఇచ్చామని చెప్పారు. కేంద్రమంత్రులను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మెట్రో రైలు నిధుల గురించి దత్తాత్రేయ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ప్రజల కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామన్నారు.
దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర ముఖ్యమైనదన్నారు. మెట్రో నిర్మాణం త్వరలో పూర్తవుతుందని చెప్పారు. హైదరాబాదును వైఫై జోన్గా మారుస్తామని చెప్పారు. బీడీ కార్మికుల కోసం సిరిసిల్లలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు.
తమ నేతలు తెలంగాణకు ఇచ్చాయని చెప్పిన నిధుల్లో రుణాలు కూడా కలిసి ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాలు పన్నులు కడితేనే నిధులు వస్తాయని చెప్పారు. కాబట్టి ఆ నిధులను కూడా కలిపి లెక్క చెప్పారన్నారు. రాజకీయ విమర్శల పైన స్పందన, ప్రతి స్పందన ఉంటుందన్నారు. పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.