పొమ్మనలేక పొగబెడుతున్నారు!, కేటీఆర్కు ఫోన్ చేసినా..: టీఆర్ఎస్పై సురేఖ నిప్పులు
హైదరాబాద్: టీఆర్ఎస్ తొలి జాబితాలో తన పేరును ప్రకటించకపోవడంపై వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని చెప్పారు. తాను ఏ జెండా పట్టుకున్నా.. తన వెంట వచ్చే కార్యకర్తలు, ప్రజలు ఉన్నారని చెప్పారు.
Recommended Video
మంత్రి పదవి ఇస్తానని! అవమానించారు: టీఆర్ఎస్పై కొండా సురేఖ ఆగ్రహం
అన్యాయం ఎందుకు చేస్తున్నారు?
తనకు టికెట్ ఇవ్వకపోవడమంటే బీసీలను, మహిళలను అవమానించినట్లేనని అన్నారు. మంత్రి పదవి ఇవ్వకుండా.. ఇప్పుడు పేరు ప్రకటించకుండా అవమానించారని కొండా సురేఖ చెప్పారు. తన పేరును తొలి జాబితాలో ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని కొండా సురేఖ టీఆర్ఎస్ అధిష్టానాన్ని నిలదీశారు. టీడీపీ నుంచి వచ్చిన గుండు సుధారాణి, దయాకర్ రావులకు టికెట్లు ఇచ్చి తనకు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎస్సీ, బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.
పొమ్మనలేక పొగబెడుతున్నారు..
తన పేరును తొలి జాబితాలో ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని కొండా సురేఖ టీఆర్ఎస్ అధిష్టానాన్ని నిలదీశారు. టీడీపీ నుంచి వచ్చిన గుండు సుధారాణి, దయాకర్ రావులకు టికెట్లు ఇచ్చి తనకు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు.
పార్టీ కోసం పనిచేస్తే ఇదా గౌరవం అని నిలదీశారు. పదవులిస్తామని చేర్పించుకున్న వారికి ఎవరికీ ఇవ్వలేదని అన్నారు. వారంతా ఆలోచించుకోవాలని అన్నారు. తమను పొమ్మనలేక పొగబెడుతున్నారని కొండా సురేఖ ఆరోపించారు.
కేటీఆర్కి చెప్పినా..
తొలి జాబితా ప్రకటించే ముందు కేటీఆర్ తనకు ఫోన్ చేసి.. అక్కా.. పరకాల నుంచి పోటీ చేస్తారా? లేక వరంగల్ తూర్పు నుంచా? అని అడిగారని చెప్పారు. మీరు నిల్చుంటారా? లేక మీ కూతురును పోటీ చేయిస్తారా? అని ప్రశ్నించారని తెలిపారు. అయితే, తాను కుటుంబసభ్యులతో మాట్లాడి చెబుతానని చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత తాను కేటీఆర్కు ఫోన్ చేసి.. అన్నా.. నా కూతురు కాదు.. వరంగల్ తూర్పు నుంచి నేనే పోటీ చేస్తానని చెప్పినట్లు కొండా సురేఖ తెలిపారు. వరంగల్ తూర్పు సీటు అడిగితే సంతోష్ కూడా సరే అన్నారని చెప్పారు.
అది అబద్ధం.. ఫోన్లూ ట్యాప్ చేశారు..
తాము రెండు సీట్లు అడిగామని టీఆర్ఎస్ వర్గాలు చెబుతుండటం అబద్ధమని కొండా సురేఖ అన్నారు. టీఆర్ఎస్ సర్కారు.. తమ ఫోన్లతోపాటు తమ డ్రైవర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారనని ఆమె ఆరోపించారు.
చారిపై వ్యతిరేకత ఉందనే.. అడిగాం..
మధుసూదనా చారిని పక్కనపెట్టి భూపాలపల్లి స్థానం తాము అడగలేదని కొండా సురేఖ స్పష్టతనిచ్చారు. చారిపై వ్యతిరేకత ఉందని, ఆయన గెలవడని.. వేరే వారికి అవకాశమివ్వాల్సి వస్తే.. తమకే ఇవ్వాలని కోరామని చెప్పారు. క్యాడర్ కోరితేనే తాము భూపాలపల్లి నుంచి పోటీ చేయాలని అనుకున్నట్లు తెలిపారు. భూపాలపల్లిలో కొండా మురళి బ్యానర్లు కడితే తమ పార్టీ కార్యకర్తలు, నేతపలై కేసులు పెట్టించారని మండిపడ్డారు. తాము ఎవర్నీ రెచ్చగొట్టలేదని అన్నారు. చారి గెలుపు కోసం గత ఎన్నికల్లో కొండా మురళి కూడా ప్రచారం చేశారని సురేఖ చెప్పారు.