బ్లాక్చైన్ టెక్నాలజీతో మోసాలకు చెక్, మేం ఇలా చేస్తున్నాం: కేటీఆర్ కీలక ప్రసంగం
Recommended Video
హైదరాబాద్: బ్లాక్ చైన్ టెక్నాలజీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదును తీర్చిదిద్దుతామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం అన్నారు. హెచ్ఐసీసీలో జరిగిన అంతర్జాతీయ బ్లాక్ చైన్ కాంగ్రెస్ ఐటీ నిపుణుల సదస్సుకు ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.
తెలంగాణలో ఐటీ విస్తరణకు రెండేళ్ల క్రితం తమ ప్రభుత్వం సరికొత్త పాలనను తీసుకు వచ్చిందని తెలిపారు. అందులో 10 సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. అందులో బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఉందని తెలిపారు.
బ్లాక్ టెక్నాలజీలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం
కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏది అందుబాటులోకి వచ్చినా అది ప్రజలకు చేరువయ్యేలా, ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా తాము చర్యలు చేపట్టామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల అమల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తే మోసానికి ఆస్కారం ఉండదన్నారు. భూరికార్డుల ప్రక్షాళనతో పాటు రిజిస్ట్రేషన్లు, సంక్షేమ పథకాల అమలుకు ఈ బ్లాక్ టెక్నాలజీని ఉపయోగిస్తామన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అమల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.
తెలంగాణకు బ్లాక్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది
తెలంగాణ అభివృద్ధి పథంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని కేటీఆర్ తెలిపారు. ఐటా ఆధారిత సేవలను రోజు రోజుకు బలపరుస్తూనే ఉన్నామని చెప్పారు. పారిశ్రామిక విప్లవంలో డిజిటల్ విప్లవం కూడా కీలకమైందన్నారు. కొత్త కొత్త టెకనాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలసిస్ ఇలా ఎన్నో సాంకేతిక విప్లవాలు పుట్టుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు. సమాజానికి ఉపయోగపడని టెక్నాలజీ వ్యర్థం అన్నారు. టెక్నాలజీ ఆధారిత సమాజాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
బ్లాక్ టెక్నాలజీతో మోసాలకు చెక్ ఎలాగంటే
బ్లాక్ చైన్ టెక్నాలజీతో మోసాలకు చెక్ పెట్టవచ్చునని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపథంలో బ్లాక్చైన్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందన్నారు. మానవాభివృద్ధిలో ఇదో కొత్త అధ్యాయం అన్నారు. వివిధ శాఖలను ఈ కొత్త టెక్నాలజీ సమన్వయం చేస్తుందన్నారు. దీని వల్ల నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందన్నారు. బ్లాక్చైన్ టెక్నాలజీ ద్వారా జరిగిన లావాదేవీలు అత్యంత పకడ్బందీగా ఉంటాయన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో విశ్వసనీయత, కచ్చితత్వం పెరుగుతుందని చెప్పారు. ఆ టెక్నాలజీతో మోసాలను అరికట్టవచ్చన్నారు. లావాదేవీలపై బ్లాక్చైన్ టెక్నాలజీ పూర్తి నియంత్రణ కలిగి ఉంటుందన్నారు. ప్రజలకు చెందిన భూరికార్డులు, ఓటింగ్ రికార్డులు, ఆరోగ్యపరమైన రికార్డులు అన్నీ.. బ్లాక్చైన్ టెక్నాలజీ ద్వారా సురక్షితంగా ఉంటాయని చెప్పారు.
బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఇలా
భూరికార్డుల నిర్వహణ ప్రభుత్వాలకు అత్యంత క్లిష్టమైన సమస్య అని, కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఆ రికార్డులను సులభంగా మెయింటెన్స్ చేయవచ్చునని కేటీఆర్ చెప్పారు. భూపత్రాలు, భూమిని ఎవరికి అమ్మారు, ఎవరు కొన్నారు అనే అంశాలు ఈ టెక్నాలజీతో భద్రంగా ఉంటాయన్నారు. మున్ముందు బ్లాక్ చైన్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తుందన్నారు. ఇది అత్యుధునిక, సమగ్రమైన, పారదర్శక టెక్నాలజీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన 93 శాతం సక్సెస్ అయిందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా కొన్ని పైలట్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందన్నారు. 10వ తరగతి సర్టిఫికేట్లను భద్రపరిచేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల డేటాను ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చున్నారు.