టార్గెట్ టీఆర్ఎస్.. ఇక దాడులు ముమ్మరం చేస్తాం: మావోయిస్ట్ జగన్
Recommended Video
హైదరాబాద్: గత కొన్నేళ్లుగా వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు పోలీసులు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం సమీపంలోని తడపలగుట్టల్లో జరిగిన తాజా ఎన్కౌంటర్ ఆ పార్టీకి శరాఘాతమనే చెప్పాలి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ కూడా ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేశారు.
టార్గెట్ టీఆర్ఎస్: మావోయిస్ట్ జగన్
'ఇకనుంచి టీఆర్ఎస్ నేతలపై దాడులను ముమ్మరం చేస్తాం.హిందుత్వ నాయకుడు రమణ్సింగ్, నియంత కేసీఆర్లు ఏకమై ఆదివాసీలను, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారు.' అని మావోయిస్ట్ జగన్ తాజాగా ఓ ప్రకటన చేశారు.
ప్రభుత్వ ఎన్కౌంటర్లను తిప్పికొడుతాం:
కార్పొరేట్లకు వనరులు దోచిపెట్టడం కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోందని జగన్ ఆరోపించారు. ప్రజల సహకారంతో ప్రభుత్వ దాడులను తిప్పికొడుతామని చెప్పారు.
బూటకపు ఎన్కౌంటర్:
వనరుల్ని కార్పోరేట్లకు ధారాదత్తం చేసేందుకే కేసీఆర్ బూటకపు ఎన్కౌంటర్లు చేయిస్తున్నారని జగన్ ఆరోపించారు. భూపాలపల్లి ఎన్కౌంటర్లో అగ్ర నేతలు చనిపోయారంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పు పట్టారు. ఇదంతా ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకే అన్నారు.
అందులో నిజం లేదు..:
పోలీసులు చనిపోయారని చెబుతున్న తెలంగాణ పార్టీ సెక్రటరీ హరిభూషణ్, కీలక నేతలు బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి చనిపోలేదని జగన్ పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో చనిపోయిన 10 మందిలో జిల్లా కమిటీ సభ్యుడు హన్మకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రత్న ఉన్నారని తెలిపారు.