నాడు సినిమా వాళ్లనూ బ్లాక్మెయిల్ చేసి, ఇప్పుడు సీమాంధ్రులపై ప్రేమ: విహెచ్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో సమయంలో సినిమా వాళ్లను తెరాస నేతలు బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలు ఎవరూ మరవలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు శుక్రవారం నాడు అధికార పార్టీపై మండిపడ్డారు.
ఉద్యమంలో సమయంలో ఆంధ్రావాళ్లు అంటూ రెచ్చగొట్టిన తెరాస నేతలు ఇప్పుడు వారి పైన ప్రేమ కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో వారి ఓట్ల కోసమే ఈ ప్రేమ అన్నారు. నాడు సీమాంధ్రుల పైన తెరాస నేతలు చేసిన వ్యాఖ్యల వీడియోలను విడుదల చేస్తామన్నారు.
సినిమా వాళ్లను కూడా బ్లాక్ మెయిల్ చేశారన్నారు. ప్రభుత్వాల లోపాల పైన గవర్నర్ నరసింహన్ సరిగా స్పందించడం లేదని వి హనుమంత రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రేటర్ అభివృద్ధి కోసం వేల కోట్లు: తలసాని
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం అన్నారు. బోరబండలో ఐదు మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణానికి మంత్రి తలసాని నేడు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. ఇంటింటికీ మంచి నీరు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తోందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, గ్రేటర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు.