106 సీట్లు మనవే, సిట్టింగ్లకు సీట్లు, జాతీయ రాజకీయాల్లోకి కీలకం: కెసిఆర్ సంచలనం
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ 106 సీట్లు వస్తాయని తెలంగాణ సీఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. మూడు రకాల సర్వేల్లో ఇదే రకమైన నివేదికలు వచ్చాయని కెసిఆర్ చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కూడ కీలక పాత్ర పోషించనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.
టిఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం ఆదివారం నాడు తెలంగాణ భవన్లో జరిగింది.ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మార్చి 12వతేది నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
అదే విధంగా రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను కెసిఆర్ ప్రకటించారు. జోగినిపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ బండ ప్రకాష్ పేర్లను టిఆర్ఎల్పీ సమావేశంలో కెసిఆర్ ప్రకటించారు.

106 సీట్లు గెలుస్తాం
2019 ఎన్నికల్లో టిఆర్ఎస్కు 106 సీట్లు వస్తాయని టిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే మూడు రకాల సర్వేల్లో ఇదే రకమైన ఫలితాలు వచ్చాయని కెసిఆర్ టిఆర్ఎల్పీ సమావేశంలో ప్రకటించారు. బాష రాని వారితో కూడ సర్వే నిర్వహించినప్పుడు కూడ ఇవే ఫలితాలు వచ్చాయని కెసిఆర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు విషయంలో ఢోకా లేదని కెసిఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు భరోసాను ఇచ్చారు.

సిట్టింగ్లకు టిక్కెట్లు
ప్రస్తుతం టిఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేందరికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లను కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. గతంలో సర్వే రిపోర్ట్ల ఆధారంగా కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని నివేదికలు వెల్లడించాయి. అయితే ప్రజల్లో అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలను గెలిపించుకొనే బాధ్యత తనదని కెసిఆర్ చెప్పారు.ఎవరినీ కూడ మార్చబోనని ఈ సమావేశంలో కెసిఆర్ ప్రకటించారు. అంతేకాదు కొత్తవారికి టిక్కెట్లను కేటాయించబోననని స్పష్టత ఇచ్చారు.

జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర
జాతీయ రాజకీయాల్లో తాను క్రియా శీలక పాత్ర పోషించనున్నట్టు తెలంగాణ సీఎం కెసిఆర్ మరోసారి ప్రకటించారు. ఇక్కడే అక్కడ నడిపిస్తాననని జాతీయ రాజకీయాలపై తన పాత్ర గురించి కెసిఆర్ టిఆర్ఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ది దేశ రాజీకీయాల్లో చర్చకు తెరలేపుతోందని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ గురించి పట్టించుకోవసరం లేదు
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టిఆర్ఎస్కు ఎదురు లేదన్నారు కెసిఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ సహ ఇతర పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కెసిఆర్ చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టినా పార్టీ అభ్యర్ధుల గెలుపును అడ్డుకోలేరని కెసిఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications