వదలని వాన: మరో రెండు రోజులపాటు తెలంగాణ తూర్పు, ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: ఇప్పటికే తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టించగా మరికొద్ది రోజులపాటు రాష్ట్రాన్ని వదిలేలా లేవు. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని చాలా గ్రామాలు వరదనీటిలోనే ఉన్నాయి. భద్రాచలంలో ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. సాయం కోసం వేలాది మంది వరద బాధిత ప్రజలు ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర, తూర్పూ తెలంగాణ జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రటకనలో పేర్కొన్నారు.
శుక్రవారం ఒడిశా తీరం, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం వాయువ్యవ బంగాళాఖాతంలోని ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే మరో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని ప్రకటించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన, సీఎం ఏరియల్ వ్యూ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో కొత్తగూడెంకు బయల్ధేరుతారు. అక్కడి నుంచి భద్రాచలం వెళ్తారు. గోదావరి వరద కారణంగా జిల్లాలో ఏర్పడిన పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో గవర్నర్ మాట్లాడనున్నారు. శనివారం ఢిల్లీలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇచ్చే విందులకు గవర్నర్ హాజరుకావాల్సి ఉండగా.. భద్రాచలం పర్యటన నేపథ్యంలో ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.
ఇది ఇలావుండగా, వరద ప్రభావిత గోదావరి పరివాహక ప్రాంతాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే చేయనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృత్తి విపత్తు, గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదలపై సమీక్షించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకున్న గోదావరి