Rain: తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా ఎండ, ఉక్కపోతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో.. రాష్ట్రంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రం శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై.. దక్షిణ ఆంధ్రా తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 3న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని.. వీటి ప్రభావంతో వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ హైదరాబాద్ సంచాలకురాలు కే నాగరత్న తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఉదయం వేళ పొగమంచు కురిసే సూచనలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 3, 4, 5 తేదీల్లో వానలు కురుస్తాయని తెలిపారు.
కాగా, గత కొన్ని రోజులుగా వర్షాలు కానరావడం లేదు. ఈ సీజన్లో జూలైలో భారీ వర్షాలు కురవగా.. ఆగస్టులో లోటు వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో వర్షాలు కురుస్తేనే పంటలు చేతికివచ్చే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications