తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు: ఎప్పట్నుంచంటే..?, 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులపాటు పొడి వాతావరణం కొనసాగుతోంది. తేలికపాటి చినుకులు పడినప్పటికీ.. ఎండ తీవ్రత మాత్రం ఎక్కువగానే ఉంటోంది. అయితే, తాజాగా, వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మూడో తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు ఉంటాయని హెచ్చరించింది. ఈ క్రమంలో శుక్ర, శని, ఆదివారాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆగస్టు 31న అంటే గురువారం సాయంత్రం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వార్షాలు కురుస్తాయని తెలిపింది.

శుక్రవారం నుంచి మూడు రోజులపాటు మాత్రం ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఈ రోజుల్లో ఉదయం పూట పొగమంచు ఉంటుందని.. సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.
కాగా, ఆగస్టు నెలలో హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే, సెప్టెంబర్ నెలలో మాత్రం వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వర్షాకాల సీజన్లోనే వర్షాలు తక్కువగా ఉన్నాయని.. మొత్తంగా చూసుకుంటే సాధారణ వర్షపాతమే నమోదైందని పేర్కొంది.
హైదరాబాద్ నగర పరిధిలో సగటు వర్షపాతం మాత్రమే నమోదైందని.. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లోనే అత్యధిక వర్షం కురిసిందని తెలిపింది. మిగితా అన్ని ప్రాంతాల్లోనూ సాధారణ వర్షమే పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, సెప్టెంబర్ నెలలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.












Click it and Unblock the Notifications