తెలంగాణా విద్యకు ఏమైంది ? చివరకు లాసెట్ ఫలితాలు కూడా లీకా ?
తెలంగాణా రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఏ పరీక్షలు జరిగినా ఏదో ఒక అవకతవకలు జరగాల్సిందే. ఒకపక్క విద్యార్థులు, విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నా , ఆందోళనలు చేస్తున్నా విద్యాశాఖ పనితీరులో ఏ మాత్రం మార్పు లేదు . తాజాగా లాసెట్ ఫలితాలు విడుదలకు ముందే వెబ్సైట్లో దర్శనమిచ్చిన సంఘటన విద్యార్థులను నివ్వెరపరిచింది. తీరా ర్యాంక్ కార్డులు డౌన్ లోడ్ చేసుకున్నాక తూచ్ మేం ఫలితాలు విడుదల చెయ్యలేదు అని అధికారులు చెప్పటం మరింత విస్మయానికి గురి చేసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు ఘోర అవమానం .. అవతరణ వేడుకల్లో కుర్చీ కూడా వెయ్యని అధికారులు
వెబ్ సైట్ లో లా సెట్ ఫలితాలు లీక్ .. మేం విడుదల చెయ్యలేదన్న అధికారులు
ఆదివారం లాసెట్ ఫలితాలు వెబ్ సైట్ లో లీకయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఓయూ అధికారులు వెంటనే వాటిని వెబ్సైట్ నుంచి తొలగించారు. తాము ఫలితాలను విడుదల చేయలేదని ప్రకటించారు. అయితే, అప్పటికే చాలామంది విద్యార్థులు ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో చేసేదేమీ లేక ఆదివారం రాత్రి అధికారులు హడావుడిగా ఫలితాలను విడుదల చెయ్యాల్సి వచ్చింది. ఇక అధికారులు విడుదల చెయ్యక ముందే ఫలితాలు లీకవడం పట్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
టెస్టింగ్ కోసం ప్రయత్నం .. వెబ్ సైట్ లో అప్లోడ్ అయిన ఫలితాలు
ఏవిధంగా ఫలితాలు లీకయ్యాయో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఫలితాల వెల్లడికి ముందు టెస్టింగ్ కోసం అధికారులు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఆ ఫలితాలు నేరుగా ఓపెన్ డొమైన్లోకి వెళ్లాయని, దీన్ని అధికారులు గమనించకపోవడం వల్లే గందరగోళం నెలకొందని అభిప్రాయపడుతున్నారు. ఫలితాలు వెబ్ సైట్ లో కనిపించి ర్యాంక్ కార్డులు కూడా డౌన్ లోడ్ చేసుకున్నాక మేము ప్రకటించలేదు అని అధికారులు వెల్లడించటం విద్యార్థుల్లో ఆగ్రహం తెప్పించింది.
లాసెట్ ఫలితాల్లో 80.80 శాతం మంది అర్హత
లాసెట్ ఫలితాల్లో మొత్తం 80.80 శాతం మంది అర్హత సాధించారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు పరీక్ష రాసిన 13,141 మంది విద్యార్థులు హాజరవ్వగా 10,539 మంది విద్యార్థులు అర్హులయ్యారు.ఐదేళ్ల కోర్సులో 4,179 మందికి 3,130 మంది అర్హత సాధించారు. ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో ఏపీకి చెందిన సూరజ్ మొదటి ర్యాంకు సాధించాడు. జనగామకు చెందిన శ్రీరామ్కు రెండో ర్యాంకు, ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మీ తనూజకు మూడో ర్యాంకు వచ్చింది. ఇక ఎల్ఎల్ఎం పరీక్షలో హైదరాబాద్కు చెందిన తారాణి మొదటి ర్యాంకు, రంగారెడ్డి జిల్లాకు చెందిన వైష్ణవి రెండో ర్యాంకు, అదే జిల్లాకు చెందిన వాగ్దేవి మూడో ర్యాంకు సాధించారు.మూడేళ్ల లా కోర్సుకు సంబంధించిన పరీక్షలో ఢిల్లీకి చెందిన వికాస్ వశిష్ట్ మొదటి ర్యాంకు సాధించాడు. భూపాలపల్లి జిల్లాకు చెందిన కె.దిలీప్ కు రెండో ర్యాంకు, హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ కు మూడో ర్యాంకు వచ్చింది.
తెలంగాణా విద్యాశాఖలో ఇది మామూలే
ఏది ఏమైనా అధికారుల అలసత్వమో, నిర్లక్ష్యమో కానీ ప్రతీ పరీక్షలో ఏదో ఒక తప్పు దొర్లుతూనే ఉంది. ఏదో ఒక పొరబాటు చెయ్యటం దాన్ని హడావిడిగా దిద్దుకోవటం విద్యా శాఖాధికారులకు అలవాటుగా మారింది. ఇదంతా విన్నవారు తెలంగాణా విద్యాశాఖలో ఇలాంటివి మామూలే అంటుంటే విద్యార్థులు మాత్రం పెదవి విరుస్తున్నారు.