నీళ్లు,నిధులు,నియామకాల తెలంగాణ ఏమైంది.?అన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కాయన్న బండి సంజయ్.!
హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత అవన్నీ ఎటువెళ్లాయని బీజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక నీళ్లు ఫామ్ హౌజ్ కు, నిధులు సీఎం చంద్రశేఖర్ రావు అనుయాయులకు, నియామకాలు చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులకే చెందాయని సంజయ్ మండిపడ్డారు. తొలి దశ, మలి దశ ఉద్యమానికి యువత ఊపిరిగా నిలిచారని, ఆ యువత తెలంగాణ ఏర్పడ్డాక ఏడేళ్లుగా ఉద్యోగం లేక, ఉపాధి లేక అల్లాడుతున్నారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేసారు.
Recommended Video
తెలంగాణ కల సాకారమై ఏడేళ్లవుతోంది..
లక్షలాది మంది యువతీ, యువకులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తున్నారని, ఉద్యోగాల కోసం ఎదురు చూసీ, చూసీ చాలా మంది ఉద్యోగ వయసు కూడా దాటిపోయిందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం 25 లక్షల మంది టీఎస్పీఎస్సీ లో రిజిస్టర్ చేసుకున్నారని పదవి విరమణ పొందిన ఛైర్మన్ ఘంటా చక్రపాణి ఓ సందర్బంలో ప్రకటించారని చెప్పారు.
అందులో భాగంగా అర్హత ఉన్న కొంతమందికైనా ఉద్యోగాలు కల్పించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలనే సంకల్పం చాలా మంది యువతలో ఉందని. యువత కోరికను సీఎం చంద్రశేఖర్ రావు నెరవేర్చాలని సంజయ్ విజ్ఞప్తి చేసారు.
నిరుద్యోగులను నిలువునా ముంచారు
తెలంగాణలో దాదాపు రెండు లక్షల తొంబై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని బిస్వాల్ కమిటీ ప్రకటించిందని, మన రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? అని సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయలేదని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేశారని, నిరుద్యోగులను తెలంగాన ప్రభుత్వం నిలువునా ముంచిందని సంజయ్ స్పష్టం చేసారు.
విద్యావాలంటీర్లు పస్తులుంటున్నారు..
గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అవగానే 50 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వస్తోందని తప్పుడు మాటలు చెప్పి చంద్రవేఖర్ రావు యువతను మోసం చేశారని మండిపడ్డారు. 25 వేల విద్యుత్ ఆర్జిజన్ ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పీఆర్సీ ఇస్తామని ప్రకటించినా ఇప్పటి దాకా ఆ ప్రక్రియ పూర్తికాలేదని ఘాటుగా విమర్శించారు సంజయ్. కరోనా కారణంగా ఏడాదిన్నరగా 12 వేల మంది విద్యావాలంటీర్లు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు బండి సంజయ్.
అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలి..
తెలంగాణ వచ్చాక ఉద్యోగాలొస్తాయనుకుంటే దాదాపు 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని రోడ్డున పడేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలనుకుంటే చంద్ర శేఖర్ రావు ఇచ్చిన వాగ్దానాల్లో కొన్నింటినైనా అమలు చేయాలని సంజయ్ సూచించారు.
ఇప్పటికైనా 7 వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, 2018 నుంచి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని బండి సంజయ్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును డిమాండ్ చేసారు.