ఒకవేళ తెలంగాణ లాక్ డౌన్ చేస్తే..? వాట్ నెక్స్ట్.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటలకు పొడగించారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు ప్రతీ ఒక్కరూ కర్ఫ్యూ పాటించాలన్నారు. వర్తక వ్యాపార వాణిజ్య సంఘాలు కూడా స్వయం నియంత్రణతో కర్ఫ్యూ పాటించాలన్నారు. వైరస్ నియంత్రణ గురించి ప్రభుత్వం చాలా సమాలోచనలు జరుపుతోందని.. అవన్నీ బయటకు చెప్పట్లేదని వెల్లడించారు.
ఒకవేళ మున్ముందు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి తలెత్తితే.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నామన్నారు. అవసరమైతే ఇళ్లకే రేషన్ సరుకులు,ఇతరత్రా నిత్యావసరాలను డోర్ డెలివరీ చేసే పద్దతి గురించి ఆలోచిస్తున్నామన్నారు. డెలివరీ కోసం ఎన్ని కుటుంబాలకు ఎన్ని వాహనాలు అవసరమవుతాయి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇప్పటినుంచే దృష్టి సారించినట్టు చెప్పారు.
కరోనా వైరస్ సృష్టించిన సంకట స్థితిని స్వయం నియంత్రణతోనే ఎదుర్కోగలమని తెలిపారు. తద్వారా మన కుటుంబం.. దేశం.. యావత్ మానవాళికి మేలు చేసినవారమవుతామని అన్నారు. కర్ఫ్యూ రోజున సకలం బంద్ ఉంటాయని.. కేవలం ఎలక్ట్రిసిటీ,ఆసుపత్రులు,మెడికల్,పారిశుద్ధ్యం వంటి అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. ఆదివారం(మార్చి 22) ఒక్కరోజు సంపన్నులు పనిమనుషులకు సెలవు ఇవ్వాలన్నారు. ఆ ఒక్కరోజు ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలని.. ఎవరి ఇంట్లో వాళ్లే ఉండాలని తెలిపారు. ఇక ఇలాంటి క్లిష్ట తరుణంలో ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను సీఎం కేసీఆర్ అభినందించారు. వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ఒకవేళ వైద్యులకు కూడా వైరస్ సోకి.. వారికేమైనా అయితే... చేతులెత్తేసినట్టే అన్నారు. కాబట్టి ఉన్న డాక్టర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారికోసం అవసరమైన ప్రత్యేక సూట్స్,ఇతరత్రా సామాగ్రి తెప్పించామన్నారు.
వైరస్ నియంత్రణ కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ,చీఫ్ సెక్రటరీ,సీఎంవో కార్యాలయం,డీజీపీ కార్యాలయం,ఇతర నిపుణులతో కలిపి ఐదుగురు సభ్యుల కమిటీని వేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని కనిపెడుతూనే.. దాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు అవసరమో ఆ కమిటీ సూచిస్తుందన్నారు. ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి తెలియజేస్తుందన్నారు. కరోనా నియంత్రణ కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని.. అయితే ప్రభుత్వ చర్యలకు ప్రజల సహకారం తప్పనిసరి అని స్పష్టం చేశారు.