కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన - అదేనా అంతర్యం...!!
దసరా నాడు తెలుగు ప్రజల్లో కేసీఆర్ జాతీయ పార్టీ హాట్ టాపిక్ గా మారింది. నేడు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పేరుతో రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో తనకు మద్దతుగా వచ్చిన ఇతర పార్టీ నేతలకు అల్పహార విందు ఏర్పాటు చేసారు. పార్టీ కార్యవర్గ సమావేశం కోసం సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు హాజరయ్యారు.
మొదలైన కార్యవర్గ సమావేశం
ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు సరిగ్గా 1.19 గంటలకు కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు పైన కార్యవర్గ సమావేశంలో ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యవర్గ సమావేశంలో నాడు టీఆర్ఎస్ ఏర్పాటుకు కారణాలు.. సాధించిన విజయాలతో పాటుగా ప్రస్తుతం బీఆర్ఎస్ ఏర్పాటుకు కారణాలను - లక్ష్యాలను స్పష్టం చేయనున్నారు.
జాతీయ స్థాయిలో ఏ విధంగా ముందుడుగు వేయనుంది వివరించనున్నారు. తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ తో పాటుగా వచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, జేడీఎస్, వీసీకే పార్టీ నేతలకు ఘన స్వాగతం లభించింది. ఇప్పటికే ప్రగతి భవన్ టు తెలంగాణ భవన్ వరకు పార్టీ నేతలు పోటీ పడి స్వాగత తోరణాలు - ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారింది.
కేసీఆర్ పార్టీ పైన చంద్రబాబు ఒక నవ్వుతో
తెలంగాణ భవన్ లో పార్టీ సమావేశానికి ప్రారంభానికి ముందు ప్రొఫోసర్ జయశంకర్ కు కేసీఆర్ నివాళి అర్పించారు. ఇక, ఇదే సమావేశంలో జాతీయ స్థాయిలో మద్దతుగా నిలిచే పార్టీలు - సంస్థల వివరాలను కేసీఆర్ వెల్లడించనున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు పైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందన తెలుసుకొనేందుకు మీడియా ప్రయత్నాలు చేసింది. దీని పైన చంద్రబాబు ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయారు. దీంతో..ఇప్పుడు రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాడు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు తరువాత..ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు వ్యవహరించారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు కాంగ్రెస్ తోనూ జత కట్టారు. అనేక జాతీయ పార్టీల నేతలతో ఢిల్లీ కేంద్రంగా మంతనాలు జరిపారు.
జెండా - అజెండాపై సీఎం కేసీఆర్ క్లారిటీ
కానీ, మోదీ ఎన్నికల్లో గెలిచి రెండో సారి ప్రధాని పగ్గాలు చేపట్టారు. ఏపీలో చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఇప్పుడు కేసీఆర్ ఓపెన్ గానే తన టార్గెట్ ప్రధాని మోదీని గద్దె దించటమని స్పష్టంగా చెబుతున్నారు. ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు రాజధాని గురించి స్పందించారు. కేసీఆర్ పార్టీ పైన మాట్లాడేందుకు నిరాకరిస్తూ నవ్వుతూ వెళ్లిపోయారు. ఇప్పుడు ఇది తెలుగు రాజకీయాల్లో అటు చర్చకు కారణమైంది. ఇక..కేసీఆర్ తన పార్టీ లక్ష్యాల గురించి ఏం చెప్పబోతున్నారనేదీ ఇప్పుడు ఆసక్తి కరమే. ఈ సాయంత్రం మీడియా సమావేశంలో కేసీఆర్ వీటన్నింటికీ క్లారిటీ ఇవ్వనున్నారు.