పెద్ద నగదు నోట్ల రద్దుపై సామాన్యుడేమనుకొంటున్నాడంటే
హైదరాబాద్ : కేంద్రం ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేయాలని తీసుకొన్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్పిడి చేసుకొనేందుకు ప్రజలు పెద్ద ఎత్తున అన్ని మార్గాలను వెతుకుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 30వ, తేది వరకు ఐదువందలు, వెయ్యి రూపాయాల నోట్లను మార్చుకొనే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది ఆ నోట్లను తీసుకొనేందుకు వెనుకాడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం పట్ల సామాన్యులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అవినీతిని పెంచేందుకు ఈ నిర్ణయం దోహాదపడుతోందని కొందరు అభిప్రాయపడుతుండగా, మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.అయితే ముందుగా ఈ అంశానికి సంబందించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.కార్పోరేట్ కంపెనీలు, రాజకీయనాయకులకు ఈ అంశం అంతర్ఘతంగా తెలిసి ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం నల్లధనం ఉన్నవారికి, డబ్బులున్న వారికి ప్రయోజనం కల్గించేదిగా ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చిన్న చిన్న నగదు నోట్ల కోసం అవస్థలు పడుతున్నారు.
పెద్ద నగదు నోట్ల రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పై వన్ ఇండియా హైదరాబాద్ లో పలుచోట్ల సామాన్యుల అభిప్రాయాలను తెలుసుకొనే ప్రయత్నం చేసింది.
తాళ్ళపల్లి. వెంకటేష్( ఉప్పల్ , కిరాణషాపు యజమాని) :
పెద్ద నగదు నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం మంచిదేనన్నది కిరాణా వ్యాపారి వెంకటేష్ అభిప్రాయం. అయితే ఈ నిర్ణయం పై సామాన్య జనానికి పెద్దగా అవగాహాన లేకపోవడం వల్ల వారంతా ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. రూ.500, రూ.1000నోట్ల రద్దు విషయమై ప్రజల్లో కాస్తంత భయం ఉందని, అపోహలను తొలగించేందుకు విషయంపై ప్రభుత్వమే విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేసేందుకు కూడా రూ.500నోట్లను తీసుకురావడం తమకు ఇబ్బందిగా మారిందన్నారు వెంకటేష్.
భాస్కర్ (వాటర్ ప్యూరిఫయర్ ఉద్యోగి)
'నా వద్ద ఉన్న డబ్బులన్నీ నిన్ననే చీటీ కోసం కట్టాను. కట్టిందే నయమనిపిస్తోంది. కట్టకపోయి గనుక ఉంటే.. చీటి వాళ్లు ఒత్తిడి చేేసేవాళ్లు. సమయానికి వంద నోట్లు దొరికి ఉండేవి కావు. మా అమ్మ బంగారం కొనుగోలు కోసం రూ.20 వేలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ఆమె ఉండేది ఊరిలో, ఇప్పుడా డబ్బులను బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేయాలంటే ఆమెకు ఇబ్బందిగానే ఉంటుంది. డిపాజిట్ చేయాల్సిందిగా ఎవరికైనా అప్పగించినా.. వారు మోసం చేస్తే పరిస్థితేంటి?'
డి.సత్యనారాయణ) ఓం శ్రీసాయి గ్రామర్ స్కూల్ లో టీచర్, ఉప్పల్) :
కేంద్రం తీసుకొన్న ఈ నిర్ణయం పట్ల ఒకింత సమ్మతం తెలుపుతూనే మరికొన్ని అనుమానాలను కూడా లేవనెత్తారు ఉపాధ్యాయుడు సత్యనారాయణ. సామాన్య జనానికి ఈ నిర్ణయంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.అయితే ఏటిఎం లను అర్థాంతరంగా మూసివేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వీలైనన్ని ఎక్కువ వంద నోట్లను ముద్రించిన తర్వాతే పెద్ద నగదు నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. తన పరిస్థితే గురించే వివరిస్తూ.. ఉదయం తమ ఇంటికి పెయింటింగ్ వేసేందుకు పెయింటర్స్ వచ్చారని, రూ.500నోటు ఇస్తే.. వారు దాన్ని తిరస్కరిస్తున్నారని, ఇలాంటి ఇబ్బందులు అనేకం ప్రజలు ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డారు. సామాన్యుల ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచితే నల్లధనం పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పెట్రోల్ బంక్ ల యజమానుల వినియోగదారులను ఇబ్బందిపెడుతున్నారని ఆయన చెప్పారు. రూ.500 నోటు ఇచ్చి వంద రెండు వందల రూపాయల పెట్రోలు కొట్టమంటే.. నిరాకరిస్తున్నారని, వినియోగదారుడి ఇష్టంతో సంబంధం లేకుండా ఏకంగా రూ.500 పెట్రోలు కొట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పైకి ఈ నిర్ణయం ఇప్పుడు వెలువడినప్పటికీ.. అంతర్గతంగా రాజకీయ నాయకులకు, కార్పోరేట్ శక్తులకు ఈ విషయంపై ముందుగానే సమాచారం అంది ఉండవచ్చునన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు సత్యనారాయణ.
అమృత (కిరాణషాపు యజమాని)
'ఐదు రూపాయాల కరివేపాకు కొనడానికి కూడా రూ.500 నోటు తీసుకొస్తున్నారు! చిల్లర కోసం మేమెక్కడికి పోవాలె?..' ఇదీఅమృత అనే ఓ కిరాణ వ్యాపారి అభిప్రాయం. వంద నోట్ల కోసం.. చిన్న చిన్న వస్తువుల కొనుగోళ్లకు కూడా రూ.500 నోట్లను తీసుకొస్తున్నారని ఆమె చెప్పారు. నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకే కదా! ఇదంతా అని ఆమెతో అన్నప్పుడు.. గతంలో మా షాపుకి రూ.50, రూ.100 నకిలీ నోట్లు కూడా వచ్చాయని ఆమె చెప్పడం గమనార్హం.
చుట్టు పక్కలవాళ్లంతా.. వంద నోట్లు ఉంటే ఇవ్వాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని తమ ఇబ్బందుల గురించి వివరించారుఅమృత.
కర్ణ ( టీ షాపు యజమాని) :
ఇంకా స్పష్టత రావాలన్నట్టుగా.. కేంద్రం నిర్ణయంపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు కర్ణ అనే టీ షాపు యజమాని. తన వద్దకు టీ తాగేందుకు వచ్చే వారు మాత్రం ఎక్కువగా ఈ నిర్ణయం పట్ల అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిపారు. లంచాధికారులు దీనివల్ల ఎక్కువగా లబ్ది పొందే అవకాశముందని, రూ.2వేల నోటును ప్రవేశపెట్టడంతో.. అవినీతిని ఇంకో వెయ్యికి పెంచినట్టయిందని పలువురు అభిప్రాయపడుతున్నట్టుగా కర్ణ చెప్పడం గమనార్హం.
రాంచందర్ ( టీ స్టాల్ యజమాని)
పెద్ద నగదు నోట్లను రద్దు చేయడం సరైన నిర్ణయమే అన్నారు రాంచందర్. అయితే ఈ నిర్ణయం వల్ల ఓ నెలరోజుల వరకు తమలాంటి చిరువ్యాపారులకు ఇబ్బందులు తప్పకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల నల్లధనం బయటకు వస్తే మంచిదే కదా! అని ఆయన అభిప్రాయపడ్డారు.