రైతు రుణమాఫీ ఎప్పుడు..? తడిసి మోపెడైన వడ్డీ భారం..! మార్గదర్శకాలు రూపొందించని సర్కార్..!!
Recommended Video
హైదరాబాద్ : శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసిన వాగ్దానం అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. లక్ష వరకూ రైతు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రకటన ఇంకా అసెంబ్లీ గేటు కూడా దాటడం లేదు. మరో నెలలో ఖరీఫ్ సీజన్ మొదలవబోతోంది! రైతులు పొలంబాట పట్టే సమయం దగ్గరపడుతోంది! అయినా, రైతు రుణమాఫీ పథకం బాలారిష్టాలను దాటడంలేదు. సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో అన్నదాతలను రుణ విముక్తులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పథకం అమలుపై అస్పష్టత నెలకొంది. కటాఫ్ తేదీ విషయం తప్ప మిగిలిన ఏ అంశంలోనూ స్పష్టత లేకపోవడం, మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
మాఫీకి 32 వేల కోట్లు అవసరం..! కేటాయించింది మాత్రం 6వేల కోట్లే..!!
రాష్ట్రవ్యాప్తంగా గత డిసెంబరు 11 నాటికి రుణమాఫీ పథకం లబ్ధిదారులు ఎంతమంది అన్న లెక్కను బ్యాంకర్లు తేల్చేశారు. గతంతో పోలిస్తే ఈసారి రైతుల సంఖ్య బాగా పెరిగింది. ఈసారి రైతు రుణమాఫీ మొత్తం లబ్ధిదారుల సంఖ్య 48.14 లక్షలు. 2014- 18 మధ్య కాలంలో మాఫీ పొందిన రైతులు 35.29 లక్షలే! ఈసారి 6 లక్షల మంది రైతులు బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు. గడిచిన ఐదేళ్ల నుంచి కూడా ‘పంట రుణాల మాఫీ పథకం' ఒడిదుడుకుల మధ్య సాగుతూ వస్తోంది. 16,124 కోట్ల రూపాయలను మాఫీ చేయటానికి ఐదేళ్లు పట్టింది. 35.29 లక్షల మంది రైతులకున్న రుణాలను నాలుగు భాగాలుగా విడగొట్టి... ఐదు విడతల్లో మాఫీ చేశారు. అయినప్పటికీ చక్రవడ్డీ సమస్యలు ఇంకా రైతులను వెంటాడుతూనే ఉన్నాయి.
మరో నెలలో ఖరీఫ్ ప్రారంభం..! ప్రభుత్వ వరంగాల్లో కొరవడిన స్పష్టత..!!
రెండోసారి చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత, ఫిబ్రవరి 22న రుణమాఫీ కటాఫ్ తేదీపై స్పష్టత ఇచ్చారు. 2018 డిసెంబరు 11 నాటికి రైతులకున్న పంట రుణ బకాయిలను లక్ష రూపాయల వరకూ మాఫీ చేస్తామని అసెంబ్లీలో సీఎం చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అయితే రుణమాఫీ ఎలా చేస్తారనే అంశంపై ఎలాంటి మార్గదర్శకాలూ జారీ చేయలేదు. లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామన్నపుడు, ఒక్కో రైతుకు లక్ష రూపాయల చొప్పున మాఫీ చేస్తారా? ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున మాఫీచేస్తారా? అనే కీలకమైన అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కొందరు రైతులు బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి, బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు.
తడిసిమోపెడైన వడ్డీలు..! ఇంకా మార్గదర్శకాలు రూపొందించని ప్రభుత్వం..!!
ఈ రుణాలపైనా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఒక విడతలో నాలుగో వంతు రుణాన్ని మాఫీచేస్తే, రెండో విడతకు వచ్చేసరికి, మిగిలిన బకాయిపై వడ్డీ పడుతోంది. మూడు, నాలుగో విడతకు వెళ్లేసరికి వడ్డీ తడిసి మోపెడవుతోంది. వడ్డీని ఎప్పుడు? ఎలా? ఏ విడతలో చెల్లిస్తారనే అంశం కూడా తేలాల్సి ఉంది. 2014-18 మధ్యకాలంలో మూడేళ్లలో మూడు విడతలు(75 శాతం) మాఫీ చేశారు. నాలుగో విడతలో మళ్లీ రెండు భాగాలుచేసి రెండు విడతలుగా మాఫీ చేశారు. ఇప్పుడున్న లెక్క ప్రకారం ఏడాదికి ఒక వంతు చొప్పున మాఫీ చేసినా రైతులు రుణ విముక్తులయ్యే పరిస్థితి కనిపించటంలేదు.
6 వేల కోట్ల చొప్పున ఐదేళ్లిస్తారా..? అంతా అయోమయమే..!!
ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ప్రకారం, అసెంబ్లీలో సీఎం చంద్రశేఖర్ రావు ప్రకటించిన ప్రకారం లెక్కేస్తే, పంట రుణ మాఫీ పథకం అమలుచేయటానికి 32 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయి. వాస్తవానికి 48.14 లక్షల మంది రైతులకు కలిపి 38 వేల కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయి. అయితే, లక్ష కంటే ఎక్కువ ఉన్న బకాయి లెక్కచూస్తే 6 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటిని మాఫీ చేసే అవసరంలేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇక 32 వేల కోట్ల రూపాయలను ఏక కాలంలో మాఫీ చేయలేమని ఇప్పటికే సీఎం చంద్రశేఖర్ రావు స్పష్టత ఇచ్చారు. గత ఫిబ్రవరి 22 న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రుణ మాఫీకి 6 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. అదేక్రమంలో నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ప్రకటన చేశారు. బడ్జెట్ కేటాయింపుల ప్రకారం చూస్తే, ఏడాదికి 6 వేల కోట్ల రూపాయల చొప్పున నాలుగు విడతల్లో 24 వేల కోట్ల రూపాయలే మాఫీ అవుతాయి. దీనిపై రైతుల్లో ఆందోళన నెలకొంది.