కేసీఆర్ ఏం చేసినా కమీషన్ల కోసమే... ఎన్నికలప్పుడే ఎస్సీ,ఎస్టీ,బీసీలు గుర్తొస్తారు : బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నికలు వచ్చినప్పుడే ఎస్సీ,ఎస్టీ,బీసీలు గుర్తుకొస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఇప్పటివరకూ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారో లేదో సమీక్ష జరపాలని సూచించారు. కేసీఆర్ ఏం చేసినా కమీషన్ల కోసమేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం ప్రకటించిన నేపథ్యంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
కరోనా కాలంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే ఒక్కరోజు కూడా కేసీఆర్ దానిపై మాట్లాడలేదని.. కనీసం కరోనా జాగ్రత్తల గురించి ప్రజలకు చెప్పలేదని అన్నారు. అసలు కేసీఆర్కు కరోనా సోకేంతవరకు అదో వ్యాధి అన్న సంగతి కూడా ఆయనకు తెలియకపోవడం విడ్డూరమన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమే నిధులు ఇచ్చిందని... రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు.

ఆదివారం(జూన్ 28) అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకంపై చర్చించిన సంగతి తెలిసిందే. శతాబ్దాలుగా వివక్ష,అణచివేతకు గురవుతున్న దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేసీఆర్ తెలిపారు.రూ.1200 కోట్లుతో ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించనున్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100 దళిత కుటుంబాల చొప్పున అర్హులైనవారిని ఎంపిక చేసి ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రైవేట్ రంగంలోనూ దళితులకు రిజర్వేషన్ల అమలు అంశం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని కేసీఆర్ వెల్లడించారు. అయితే ఇదంతా ఎన్నికల స్టంటే అని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలోనే కేసీఆర్ ఇలాంటి పథకాలతో జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
ఇదిలా ఉంటే,బండి సంజయ్ సోమవారం(జూన్ 28) హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండల పర్యటనకు వెళ్తూ... మార్గమధ్యలో ఓ టీ స్టాల్ దగ్గర ఆగారు. టీ తాగుతూ కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడారు. బండి సంజయ్ రాకను ఊహించని ఆ టీ స్టాల్ యజమాని సంతోషం వ్యక్తం చేశాడు.












Click it and Unblock the Notifications