అవినీతే జరగనప్పుడు.. ఏసీబీ ఎక్కడిది?: రేవంత్కు కేటీఆర్ సవాల్
హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణను ఎలక్ట్రిక్ వాహనాలకు హబ్గా మార్చాలనే లక్ష్యంతోనే హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించామన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో ఈ కార్ రేసు జరపాలని ఎన్నో ప్రయత్నాలు జరగాయన్నారు. 2001లోనే చంద్రబాబు ఫార్ములా-1 రేసు నిర్వహించాలని ప్రయత్నించారని కేటీఆర్ తెలిపారు. అయితే, చంద్రబాబు ఫలితాలు ఫలించలేదన్నారు.

నాలుగు కోట్ల ప్రజల మధ్య ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై చర్చ చేపట్టాలని అసెంబ్లీ స్పీకర్ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ కార్ అంశంపై చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదన్నారు. అసెంబ్లీలో చర్చ చేపట్టే దమ్ముందా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. తాము అక్రమాలు చేశామని ప్రభుత్వం అంటోందని.. అక్రమాలు నిరూపించకుండా లీకులిస్తూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఫార్ములా 1 రేస్ ట్రాక్ కోసం గోపన్పల్లిలో భూసేకరణ జరిగిందని.. అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కూడా 15 ఎకరాల భూమి ఉందని కేటీఆర్ చెప్పారు. ఎఫ్-1 చుట్టూ నగరాల అభివృద్ధి ఆధారపడి ఉందని తెలిపారు. తాము నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ ను చాలా మంది ప్రముఖులు ప్రశంసించారని కేటీఆర్ చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వం కలిపి ఈ రేస్ కోసం పెట్టిన ఖర్చు రూ. 150 కోట్లు అయితే.. వచ్చిన ఆదాయం దాదాపు రూ. 750 కోట్లు అని కేటీఆర్ వివరించారు.
కార్ రేసింగ్ నిర్వాహకులకు హెచ్ఎండీఏ రూ. 55 కోట్లు చెల్లించింది వాస్తవమని కేటీఆర్ తెలిపారు. రూ. 55 కోట్లు తీసుకున్నట్లు నిర్వాహకులు కూడా చెబుతున్నారు. ఇక, ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. అవినీతి జరగనప్పుడు ఏసీబీ ఎక్కడ్నుంచి వచ్చిందని నిలదీశారు. రేసింగ్ రద్దయినందుకు లైసెన్స్ ఫీజు రూ. 74 లక్షలు వాపస్ తీసుకోవాలని ఎంఎఫ్ఎంఎస్ఏ వారు లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. కేసులకు భయపడేది లేదని.. న్యాయపరంగా ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications