ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలు ఆశించిన ఫలితాలు ఏవి.?కేసీఆర్ నియంతృత్వపోకడ మానుకోవాలన్న జగ్గారెడ్డి.!
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు ఏడేళ్ల పాలనపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ప్రత్యేక రాష్ట్రం సాదించుకున్న తర్వాత కూడా చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ ప్రజలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాలన తెలంగాణ ప్రజలను పూర్తిగా నిరాశా, నిస్ప్రుహలోకి నెట్టేసిందని మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆత్మ గౌరవంతో బతకవచ్చని ప్రజలంతా ఆశించారని, చివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మర్యాదను కూడా పొందలేకపోతున్నారని జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలం చెందారు. ప్రజల్లో అసంతృప్తి ఉందన్న జగ్గారెడ్డి.
ఈ ఏడేళ్లలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు పదవీ విరణ చేస్తే, ఆ ఖాళీలను సైతం చంద్రశేఖర్ రావు ప్రభుత్వం భర్తీ చేయలేదని జగ్గారెడ్డి ఆరోపించారు. పీఆర్సీ కమిటీ చెప్పిన లక్ష 72 వేల ఉద్యోగాలను భర్తీ చేయలేదని మండిపడ్డారు జగ్గారెడ్డి. ప్రతి నియోజకవర్గంలో లక్ష అదనపు ఎకరాకలు నీళ్లు ఇస్తామని చెప్పిన చంద్రశేఖర్ రావు, ఒక్క ఎకరాకి నీళ్లు ఇవ్వలేదని చెప్పారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ జరగలేదని, మైనారిటీ రిజర్వేషన్ గాలికి వదిలేశారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అనేది ఓ మోసమని జగ్గారెడ్డి వివరించారు.

నిరుద్యోగ సమస్య జఠిలంగా మారుతోంది.. తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే..
విద్యార్థులు మంచి చదువులు చదవాలన్న లక్ష్యంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ ఫథకాన్ని చంద్రశేఖర్ రావు ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని జగ్గారెడ్డి మండిపడ్డారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అరకొరగానే నడుస్తోందని జగ్గారెడ్డి చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏడాదికో డీఎస్సీ వేసి ఉద్యోగాలు కల్పించడం జరిగేదని, ఏడేళ్లు పూర్తవుతున్నా ఒక్క డీఎస్సీ లేదని, నిరుద్యోగ భ్రుతి గానీ లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పుల రాష్ట్రంగా మార్చారు.. ఏడేళ్లుగా కేసీఆర్ భ్రమలు కల్పించారన్న జగ్గారెడ్డి.
అంతే కాకుండా ఏడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసారని జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ అప్పులు 2023-24 నాటికి 6 లక్షల కోట్ల రూపాయాలకు చేరుకుంటాయని జగ్గారెడ్డి చెప్పారు. అవినీతికి పాల్పడితే సొంత కుటుంబ సభ్యులను సైతం వదిలిపెట్టనని చెప్పిన చంద్రశేఖర్ రావు, పాలన అంతా అవినీతి మయంగా మారిందన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు భూ దందాల్లో మాత్రమే విజయం సాధించారని ఎద్దేవా చేసారు. అధికార పార్టీ నాయకులు యధేఛ్చగా భూ కబ్జాలకు పాల్పడుతున్నా సీఎం చంద్రశేఖర్ రావు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు చూస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం.. కేసీఆర్ అమరవీరులకు సముచిత స్ధానం ఇవ్వలేదన్న జగ్గారెడ్డి.
తెలంగాణ సాధించుకున్న ఏడేళ్లుగా ఆత్మ గౌరవం, అందరికీ సమాన వనరులు, అందరికీ ఉద్యోగాలు అనే మాటలు నీటి మూటలయ్యాయని జగ్గారెడ్డి చెప్పారు. ఏడేళ్ల చంద్రశేఖర్ రావు పాలనలో అధికారులకు జవాబుదారీ తనం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇరిగేషన్ శాఖలోనూ పారదర్శకత లేదని, టెండర్లు ఎవరికి కావాలంటే వారికి కట్టబెట్టుకోవడం, ఎప్పుడుకావాలంటే అప్పుడు అంచనాలు పెంచుకోవడం, రాష్ట్ర ధనాన్ని దోచుకోవడానికి మాత్రమేనని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దమయ్యారని జగ్గారెడ్డి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications