అమీత్ షా ఆరోపణలకు కౌంటర్ ఏది.?తెలంగాణలో లోపాయికార ఒప్పందానికి ఇదే నిదర్శనం అంటున్న విపక్షాలు
హైదరాబాద్: బీజేపి జాతీయ అద్యక్షుడు అమీత్ షా తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల పదును పెంచారు. ఓటమికి జడుసుకునే ముందస్తుకు వెళ్తున్నారంటూ, సీటిలో ఎమ్మైఎమ్ కి భయపడే ముందస్తు ఎన్నికలకు వెళ్లున్నారంటూ ఘాటుగా ఆరోపణలు గుప్పించారు. దాదాపు రెండు మీడియా సమావేశాల్లో కాకుండా మహబూబ్ నగర్ బహిరంగ సభలో ఆపథర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యక్ష సవాళ్లు సందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంత ఘోరంగా విమర్శించినా ఒక్క కేటీఆర్ తప్ప ఆ పార్టీలో ఎవ్వరూ కూడా అమీత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వలేదు. దీంతో బీజేపి, టీఆర్ఎస్ భవిశ్యత్తులో వేయబోయే అడుగులపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
అమీత్ షా ఆరోపణలకు కౌంటర్ వద్దు..! సైలెంట్ గా ఉంటేనా మంచిదంటున్న గులాబీ నేతలు..!
వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, తెలంగాణలోని 119 సీట్లతో తమ పార్టీ బరిలో ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం మజ్లిస్ కు భయపడే తెలంగాణ సర్కారు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం చేయటం లేదన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రానికి పంపారు. కేసీఆర్కు తెలుసు, బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని, అయినా బిల్లు పంపారు. కేసీఆర్ వస్తే మళ్లీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తార'ని అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘తెలుగు నేతలు అంజయ్య, పీవీ నర్సింహారావులను కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా అవమానించిందో అందరికీ తెలుసు. కనీసం 2018లో అయినా దళితుడిని సీఎం చేస్తారా చెప్పండి అని కెసీఆర్ ను ప్రశ్నించారు.
అప్పుడు అమీత్ షాను ఏకేసిని కేసీఆర్..!ఇప్పుడు నిశ్వబ్దమే సమాధానం అంటున్న బాస్..!!
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓ సారి తెలంగాణకు వచ్చి కేంద్రం ఇచ్చిన రాయితీల పట్ల లెక్కలు చెప్పారు. అంతే తెలంగాణ సీఎం కెసీఆర్ విలేకరుల సమావేశం పెట్టి బహుశా దేశంలో ఎవరూ చేయని స్థాయిలో ‘అమిత్ షా'పై రాజకీయ దాడి చేశారు. అప్పట్లో అది పెద్ద సంచలనంగా మారింది కూడా. అసలు కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేది ఏంది?. మేమే..ఓ నాలుగైదు రాష్ట్రాలే కేంద్రాన్ని సాకుతున్నాం అంటూ ఓ స్థాయిలో దుమ్ముదులిపేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని మోడీ సర్కారుతో కెసీఆర్ సయోధ్య ప్రారంభం అయింది. ఎన్నికల వేళ మళ్ళీ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసినంత పని చేసారు.
చిన్న విషయాలను ఖండించే టీఆర్ఎస్ నాయకులు..! అమీత్ షా విశయంలో సంయమనం..!
మీడియాతో పాటు బహిరంగ సభలోనూ కెసీఆర్, ఆయన ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో దళితుడికి సీఎం పదవి ఇస్తామని మోసం చేశారు..ఈ సారైనా ఇస్తారా? లేక కొడుకును సీఎం చేస్తారా? అంటూ కెసీఆర్ ను అమిత్ షా ప్రశ్నించారు. అంతే కాదు, జమిలి ఎన్నికలకు మద్దతు పలికిన కెసీఆర్ ఎందుకు ముందస్తుకు వెళుతున్నారు, రాష్ట్రంపై అనవసరపు ఆర్థిక భారం మోపటం వెనక కారణమేంటి? అని ప్రశ్నించారు. అయితే అమిత్ షా ఎక్కడ కూడా తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టుల్లో అవినీతిపై పెద్దగా ఫోకస్ పెట్టిన సందర్భం లేదు. స్థానిక నాయకులు సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతి, తదితర అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు కానీ, అమిత్ షా మాత్రం ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించారు.
నామమాత్రగా స్పందించిన కేటీఆర్..! రాజకీయ ప్రయోజనాలకోసం ఏదైనా చేయొచ్చు..!!
అయితే అమిత్ షా విమర్శలపై తెలంగాణ ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కెటీఆర్ స్పందించారు. అమిత్ షాను కేవలం ‘భ్రమిత్ షా' అంటూ ఎద్దేవా చేస్తూ, గతంలో బిజెపి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి గుర్తులేదా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మినహా పలు అంశాలపై అమిత్ షా పలు ప్రశ్నలు లేవనెత్తినా టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ మౌనంగా ఉండటం వెనక కారణం రెండు పార్టీల మధ్య ఉన్న ‘లోపాయికారీ' అవగాహనే అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. నిజంగా అదేమీ లేకపోతే అమిత్ షా వ్యాఖ్యలపై కెసీఆర్ అంత మౌనంగా ఉంటారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.