పొలిటికల్ ట్విస్ట్: తెలంగాణకు ప్రధాని మోడీ.. ఢిల్లీకి కేసీఆర్ సడెన్ టూర్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం శనివారం పర్యటించనున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నారు ప్రధాని మోడీ. శనివారం ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
హైకోర్టు సీజేను కలిసిన సీఎం కేసీఆర్
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్లోని సీజే నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్ ఆయనతో భేటీ అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం మర్యాద పూర్వకంగానే భేటీ అయినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. పలు పరిపాలనాపరమైన, ఇతర అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఉన్నారు.
తెలంగాణకు ప్రధాని మోడీ.. ఢిల్లీకి సీఎం కేసీఆర్
కాగా, హైకోర్టు సీజేతో భేటీ అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లడం గమనార్హం. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇలా సడెన్గా ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. శనివారం తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోడీ రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితమివ్వనున్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ కు కూడా ఆహ్వానం లభించగా.. ఈ సమయంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వేడిని మరింతగా పెంచింది.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న ప్రధాని
షెడ్యూల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి హెలికాప్టర్లో రామగుండం చేరుకుంటారు. రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం ఇస్తారు. తెలంగాణ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ప్రధాని మోడీ టూర్.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పంజాగుట్ట - గ్రీన్ల్యాండ్స్ - ప్రకాశ్ నగర్ టీ జంక్షన్, రసూల్పురా టీ జంక్షన్, సీటీవో మార్గాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. సోమాజిగూడ, మోనప్ప ఐలాండ్, రాజ్భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ప్రధాని మోడీ పర్యటనతో పొలిటికల్ హీట్
మరోవైపు, ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కేంద్రం ప్రొటోకాల్ పాటించకుండా తెలంగాణ సీఎంను అవమానిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నామమాత్రపు ఆహ్వానం పలుకుతున్నారన్నారు. గతంలోనూ కేంద్రం ఇలాగే వ్యవహరించిందని విమర్శించారు. ఇంతగా అవమానిస్తుంటే ప్రధాని కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఎలా వస్తారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, టీఆర్ఎస్ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. ప్రొటోకాల్ ప్రకారమే సీఎం కేసీఆర్ ను కేంద్రం ఆహ్వానించిందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్ ను ఏనాడు విస్మరించదన్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనాలని కోరుతున్నారు. మరోవైపు, ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్, వామపక్షాల నేతలు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మోడీకి తెలంగాణలో నో ఎంట్రీ అంటూ పలు ఫ్లెక్సీలను నగరంలో పలుచోట్ల దర్శనిమిస్తున్నాయి.