'కెసిఆర్కు కాలేయం పాడైందంటున్నారు', ఎవరు విచారిస్తున్నారు: ఓటుకు నోటుపై రావుల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శోభారాణి మంగళవారం ఘాటైన విమర్శలు చేశారు. కెసిఆర్కు కాలేయం పాడైందని ప్రచారం సాగుతోందని, ఇప్పుడు చీప్ లిక్కర్ తాగించి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడతారా అని ప్రశ్నించారు.
పాంటిచెడ్డ అనే లిక్కర్ మాఫియా చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టబోతున్నారని ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించి త్వరలో ఆధారాలు బయటపెడతామన్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే కెసిఆర్ చేశారని గుర్తుంచుకోవాలన్నారు.
రైతులకు తొమ్మిది గంటల విద్యుత్: కెటిఆర్
రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం చెప్పారు. రూ.15వేల కోట్లతో రహదారులు నిర్మిస్తామని చెప్పారు. మంగళవారం జిల్లాలో నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు.
గ్రామజ్యోతి కొత్తది కాదు: రాములు
గ్రామజ్యోతి పథకం కొత్త పథకమేమీ కాదని మాజీ మంత్రి రాములు అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన జన్మభూమిని కాపీ కొట్టారన్నారు. గ్రామజ్యోతి పథకంపై టిఆర్ఎస్ ఎంపీలు, జెడ్పీటీసీలే అసంతృప్తిగా ఉన్నారన్నారు.
ఓటుకు నోటులో విచారణ ఎవరు చేస్తున్నారు: రావుల
ఓటుకు నోటు కేసులో విచారణను ఎసిబి చేస్తోందా లేగా టిఆర్ఎస్ చేస్తోందా అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి ప్రశ్నించారు. ఛార్జీషీటును కోర్టు పరిగణలోకి తీసుకోకముందే మీడియాలోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎసిబి కాకుండా మరో ప్రయివేటు ఏజెన్సీ పని చేస్తోందని ముందు నుంచి తాము చెబుతున్నామన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.