తెలంగాణ సచివాలయాన్ని పేల్చేస్తాం.. బెదిరించింది ఎవరంటే ?
తెలుగు రాష్ట్రాల్లో బెదిరింపు కాల్స్ వ్యవహారం కలకలంగా మారుతోంది. ఏపీలోని పలు ప్రముఖ ప్రాంతాలతో పాటు తెలంగాణలో సైతం పలు చోట్లకు బెదిరింపు కాల్స్ రావడం భయాందోళన లకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే గత 3 రోజులుగా తెలంగాణ సచివాలయాన్ని పేల్చేస్తాం అంటూ కాల్స్ రావడం తీవ్ర దుమారంగా మారింది. అయితే బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.
సెక్రటేరియట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు రంగం లోకి దిగిన పోలీసులు.. నిందితుడు చేసిన ఫోన్ నెంబర్ ఆధారంగా అతడి ఆచూకీని కనిపెట్టారు. నిందితుడిని హైదరాబాద్ లంగర్హౌజ్కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీగా గుర్తించారు. బెదిరింపు కాల్స్ ఎందుకు చేశావని విచారణ చేపడుతున్నారు.

అర్జీలు, ఫిర్యాదుల విభాగానికి అలీ మొదట ఫోన్ చేసి బెదిరించాడు. సచివాలయాన్ని పేల్చేస్తానని అధికారులకు వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఫేక్ కాల్ అని అధికారులు భావించినప్పటికీ.. వరుసగా 3 రోజులు ఫోన్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దర్గాకు సంబంధించి ఓ సమస్యపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా.. అధికారులు స్పందించకపోవడంతో ఈ బెదిరింపులకు పాల్పడినట్లు మహ్మద్ అలీ చెప్పినట్లు సమాచారం.
ఇక మరోవైపు ఇటీవలె ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావు.. నకిలీ ఐడీ కార్డుతో సచివాలయంలో హాల్ చల్ చేశాడు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ అని చెబుతూ దందాలు చేశాడు. ఈ క్రమంలోనే అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో అధికారులు విచారించగా బాగోతం బయటపడింది. భాస్కర్ రావుని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. అతనికి నకిలీ ఐడీ కార్డు తయారు చేసి ఇచ్చిన.. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ డ్రైవర్ ని సైతం అరెస్ట్ చేశారు.
వరుసగా తెలంగాణ సచివాలయంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సచివాలయ భద్రతపై నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తరహజ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications