ఆర్టీసీ ముగిసిన అధ్యాయమే.. కార్మికులు, అధికారులు ఓకే, యూనియన్ నేతల వైఖరితోనే సమస్య: కేసీఆర్
ఆర్టీసీ కార్మికులది గొంతెమ్మ కోరికలని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అసంబద్ధమైన, అర్థంపర్థం లేని డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి మరింత నష్టాల్లోకి నెట్టారని తప్పుపట్టారు. గతంలో ఏ ప్రభుత్వం.. దేశంలో ఏ రాష్ట్రం కల్పించని ప్రయోజనాలు ఆర్టీసీ కార్మికులకు కల్పించామని కేసీఆర్ స్పష్టంచేశారు. కానీ వారు ప్రభుత్వం చేసిన ప్రయోజనాలు మరచి, అసంబద్ధ డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు.
67 శాతం ఫిట్మెంట్ ఇస్తే..
గత నాలుగేళ్లలో ఆర్టీసీ కార్మికులకు 67 శాతం ఫిట్మెంట్ పెంచినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. 67 శాతం జీతాలు పెంచిన గొంతెమ్మ కోరికలను కోరడం సరికాదన్నారు. 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని, 14 శాతం ఐఆర్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతచేశాక కూడా ఆర్టీసీ యూనియన్లు అసంబద్ధ కోరికలు కోరడం సరికాదన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయాలి అనే డిమాండ్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మరో 57 కార్పొరేషన్లు కూడా తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరితే తానేం చేయాలి అని కేసీఆర్ ప్రశ్నించారు.
రవాణాశాఖ మంత్రిగా..
గతంలో మూడేళ్లు తాను రవాణాశాఖ మంత్రిగా పనిచేశానని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేశానని వివరించారు. ప్రస్తుతం దేశంలో ఆర్థికమాంద్యం దెబ్బకు బడ్జెట్ను తగ్గించుకున్నామని పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగం కుదేలైందన్నారు. దీంతో బడ్జెట్ తగ్గించామని.. ఆర్టీసీకి నిధులు ఎలా ఇవ్వాలని అడిగారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ఆర్టీసీని మూసివేశారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో 10 కోట్ల జనాభా ఉంటే ఆర్టీసీ 200 బస్సులు నడుపుతున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. బీహార్లో కూడా వందల బస్సులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో అప్పటి సీఎం దిగ్విజయ్ సింగ్ ఆర్టీసీని మూసివేశారని తెలిపారు.
యూనియన్ ఎన్నికల కోసమే..
సమ్మెకు నిర్ధిష్టమైన కారణం లేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. 40 ఏళ్ల నుంచి ఆర్టీసీలో సమ్మె చేస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కూడా చేశారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సమ్మె చేస్తున్నారని చెప్పారు. ప్రతీ మూడేళ్లకోసారి యూనియన్ ఎన్నికలు ఉంటాయని, ఎన్నికల ముందు సమ్మె పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి విపక్షాలు మద్దతు తెలుపడం భావ్యం కాదన్నారు. ఆర్టీసీకి ఇప్పటికే 5 వేల కోట్ల అప్పులు ఉన్నాయని.. ఆర్టీసీ మునిగే నావ అని స్పష్టంచేశారు.
వారికి లాభాలేందుకు ?
ప్రైవేట్ ట్రావెల్స్కు ఎందుకు లాభాలు వస్తాయి ? ఆర్టీసీకి ఎందుకు నష్టం వస్తుంది అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆర్టీసీలో నష్టానికి గల కారణం ఏంటో దేవుడికే తెలియాలన్నారు. ఆర్టీసీలో 2100 అద్దె బస్సులు ఉన్నాయని .. కిలోమీటర్కు 75 పైసల లాభం వస్తోందని చెప్పారు. అంటే బస్సుకు రోజుకు రూ.225 లాభం వస్తుందని గుర్తుచేశారు. అద్దె బస్సులపై 4 లక్షల 72 వేల లాభం వస్తుందని చెప్పారు. కానీ ఆర్టీసీ బస్సులపై మాత్రం కిలోమీటర్కు రూ.13 నష్టం వస్తుందని .. దీని మొత్తం రోజుకు 3 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. సిటీలో సమయం ప్రకారం నడపాలి అని.. అవసరమైతే కిలోమీటర్ తగ్గించాలని డిమాండ్లు చేస్తున్నారని మండిపడ్డారు. గంట ఎక్కువ పనిచేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు.
ముగిసినా అధ్యాయమే.
ఆర్టీసీని పునరుద్ధరించడం అనే అంశం మునిగినా అధ్యాయం అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అప్పుల్లో ఉన్న ఆర్టీసీ కోలుకునే అవకాశం లేదన్నారు. గత ప్రభుత్వాలు ఆర్టీసీకి రూ.712 కోట్లు కేటాయిస్తే.. టీఆర్ఎస్ సర్కార్ 4 వేల 250 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కంటే సాయం 500 శాతానికి పైగా పెంచినట్టు పేర్కొన్నారు. అంతేకాదు పట్టణాల్లో జీహెచ్ఎంసీ నుంచి రూ.330 కోట్లు కూడా ఆర్టీసీకి ఇప్పించామని కేసీఆర్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఆర్టీసీని రూ.550 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు తెలిపారు. ఇప్పటికే రూ.425 కోట్లు విడుదల చేశామన్నారు.
సమయం చూసి..
పాత ఆర్టీసీ ఉండే అవకాశం వెయ్యి శాతం లేదని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా పండగ సమయాల్లో ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం వస్తుందని కేసీఆర్ చెప్పారు. ఆ సమయంలో సమ్మె చేయడం సరికాదన్నారు. మానుకోవాలని చెప్పినా వినిపించుకోలేదన్నారు. సెక్రటరీ స్థాయి అధికారులతో కమిటీ వేసినా గొంతెమ్మ కోరికలను కోరి కూర్చొన్న చెట్టును నరుక్కున్నారని తెలిపారు. ఆర్టీసీ సమ్మె అక్రమమని.. ఎస్మా చట్టం కూడా ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అక్రమమని లేబర్ కమిషన్ కూడా చెప్పిందన్నారు. ఇప్పటికూ 2600 బస్సులు 10 లక్షల కిలోమీటర్లు తిరిగాయని చెప్పారు. వాటని రీ ప్లేస్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం వెయ్యి కోట్ల అవసమరవుతాయని తెలిపారు.