రేవంత్ పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు -మమ్మల్ని వెళ్లగొట్టాలని ప్రయత్నం: పార్టీ మార్పుపైనా క్లారిటీ..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ వార్ పీక్ చేరింది. ఢిల్లీ వేదికగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెధవ పనులు..పిచ్చి పనులు చేస్తుంటే నేరుగా సోనియా - రాహుల్ తోనే తేల్చుకుంటామని తేల్చి చెప్పారు. తనను పార్టీ నుంచి వెల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని..ఈ రోజు దాసోజు శ్రావణ్ లాంటి మేధావి సైతం పార్టీ ఎందుకు వీడాల్సి వస్తుందని ప్రశ్నించారు. తన పార్లమెంటరీ నియోజక వర్గ పరిధిలో మునుగోడు లో జరిగే సభ పైన తనకు సమాచారం ఇవ్వరా అంటూ ప్రశ్నించారు.

సమాచారం లేకుండా సభ
తనకు ఈ రోజు పార్లమెంట్ లో ప్రశ్నలు ఉన్నాయని..కీలక భేటీలు ఉన్నాయని తెలిసి ఈ రోజు ముహూర్తంగా నిర్ణయించారని ధ్వజమెత్తారు. ఇదే విధమైన తొందర హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో నామినేషన్ల సమయం ముగిసే సమయానికి ఉద్దేశ పూర్వకంగానే కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దించారని చెప్పుకొచ్చారు. పరోక్షంగా బీజేపీ అభ్యర్ధికి ఓట్లు పడేలా చేసారని ఆరోపించారు. ఈటల రాజీనామా చేసిన తరువాత ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక వస్తుందని తెలిసినా..ఎందుకు అక్కడ శ్రద్ద పెట్టలేదని నిలదీసారు.

మా అందరినీ బయటకు పంపేలా
అనేక ప్రాంతాల్లో పలు పేర్లతో సభలు నిర్వహించిన రేవంత్.. హుజూరాబాద్ లో ఎందుకు ఏర్పాటు చేయలోదో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తనను ఓడిస్తానంటూ..తన ఓటిమి కోసం పని చేసిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవటం తప్పు కాదా అంటూ ఫైర్ అయ్యారు. తాను ఢిల్లీలోనే ఉన్నా.. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా మల్లిఖార్జన ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్పించారని ఆక్షేపించారు. తనను సైతం పార్టీ నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. శ్రీధర్ బాబు ఎక్కడైనా కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

పార్టీ మార్పు అవకాశమే లేదు
నిజమైన కాంగ్రెస్ వాదులను బయటకు పంపి..,.టీడీపీ వాళ్లను తీసుకొని పార్టీ నడపాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. వారంతా ఓడిపోయినా.. రేవంత్ కు వచ్చే నష్టం లేదన్నారు. రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్న మీడియా సంస్థలు తాను పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం చేస్తోందని..తాను కాంగ్రెస్ లోనే పుట్టానని.. కాంగ్రెస్ లోనే ఉంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. తన పార్లమెంట్ పరిధిలో సభ పెడితే ఎందుకు చెప్పరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు స్పష్టత ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications