వైసీపీలోకి టీడీపీ కీలక నేతలు, హైదరాబాద్కు లింక్: కొత్తకుట్ర ఏమిటో చెప్పిన చంద్రబాబు
అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కొందరు నేతలు హైదరాబాదులో కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడిన తెరాసతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాలూచీ పడిందని విమర్శించారు. హైదరాబాదులో ఆస్తులు ఉన్నవారిని బెదిరించి రాజకీయం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేసులు, బెదిరింపులు, ఒత్తిళ్లతో నేతలు పార్టీలు మారేలా చేస్తున్నారని చెప్పారు.
ఏపీపై కుట్ర జరుగుతోంది
ఏపీ పైన ఇప్పుడు మరోసారి కుట్ర జరుగుతోందని చంద్రబాబు అన్నారు. అందులో భాగంగానే హైదరాబాదులో ఆస్తులు ఉన్నవారిని మనకు (టీడీపీకి) వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నారని, తద్వారా వారు వైసీపీ అధినేత జగన్ వైపు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను బెదిరించడం విడ్డూరమన్నారు. తాము చెప్పినట్లు చేయాలని కమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బెదిరించి, భయపెట్టి మన మీదకు ఉసిగొల్పుతున్నారన్నారు.
మనం చాలా నష్టపోతున్నాం
ఇది చాలా దారుణమైన కుట్ర అని చంద్రబాబు అన్నారు. దీని వల్ల మనం చాలా నష్టపోతున్నామన్నారు. అలా బెదిరించే వాళ్లు గెలిస్తే మనకు పై రాష్ట్రం నుంచి వచ్చే నీళ్లు కూడా రావని వైసీపీ అధినేతను ఉద్దేశించి అన్నారు. అయితే చంద్రబాబు నేరుగా ఎవరి పేరును ప్రస్తావించలేదు.
పరోక్షంగా ఈ ముగ్గురు టార్గెట్
అయితే, ఆయన ఏపీలోని ప్రతిపక్ష వైసీపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పరోక్షంగా మాట్లాడినట్లుగా భావిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన ఈ మూడు పార్టీలను ఒకే ఘాటాన కడుతున్నారు. ఇప్పుడు హైదరాబాదులోని ఆస్తులు ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులను బెదిరించి, పార్టీ మారేలా చేస్తున్నారని చెబుతున్నారు. నేతలు ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జగన్, కేసీఆర్, మోడీలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.