ప్రేమించి పెళ్లి: ప్రియుడి సాయంతో భార్య చంపేసింది
ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని చేజేతులా చంపేసింది. ఈ కేసు మిస్టరీని సుబేదారి పోలీసులు ఛేదించారు.
వరంగల్ : ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు అయిన తరువాత మారో వ్యక్తితో సంబంధం పెట్టుకొని భర్తను చంపిన మహిళా గుట్టును వరంగల్ జిల్లాలోని సుబేదారి పోలీసులు ఛేదించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ ఎ.శ్రీనివాస్, ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపిన ప్రకారం... దామెరా మండలం కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన సుదర్శన్, సునీత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బతుకుదెరువు కోసం హన్మకొండకు వచ్చిన వీరు ఓ ఫంక్షన్హాల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి సునీతకు మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అడ్డుగా ఉన్న సుదర్శన్ను తొలగించుకోవాలని పథకం పన్నారు. ఈనెల 5న సుదర్శన్ మద్యం తాగి ఇంట్లో గాడ నిద్రలో ఉండగా ఇద్దరు కలిసి హత్య చేశారు. అదే రాత్రి మృతదేహాన్ని బస్తాలో కట్టి ఆటోలో వేసుకొని భట్టుపల్లి శివారు ఇందిరానగర్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ పెట్రోల్ పోసి తగులబెట్టారు.
ఆదృశ్యం కేసు నమోదు
రెండు రోజుల తరువాత సునీత తన భర్త కనిపించడంలేదని ఫిర్యాదు చేయగా సుబేదారి ఎస్సై గండ్రాతి సతీష్ కేసు నమోదు చేశారు. అప్పటికే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తిపై కాజీపేటలో కేసు నమోదై ఉంది. కాజీపేటకు వెళ్లి చూడాలని సునీతకు సూచించడంతో ఆమె అక్కడకు వెళ్లి తన భర్త కాదని చెప్పింది.
తరువాత ఎస్సై సతీష్కు అనుమానమొచ్చి విచారణ ప్రారంభించారు. సుదర్శన్ను ఎవరు చంపి ఉంటారని ఆరా తీయగా సునీత చెప్పిన మాటలు నమ్మకాన్ని కలిగించలేదు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా నిందితురాలు నేరాన్ని ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి సునీతను అరెస్టు చేశారు. నిందితురాలు చేసిన పొరపాటుతో ఇద్దరు కుమారులు దిక్కులేనివారయ్యారు. నిందితున్ని అరెస్టు చేసిన వారిలో సుబేదారి కానిస్టేబుల్ ఏలియా, శ్రీనివాస్, సుదర్శన్, భిక్షపతి ఉన్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు టుజ్జ నాగేందర్రావు(20)అనే యువ రైతు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలం గుర్రంపేట గ్రామపంచాయతీ పరిధిలోని మల్లయ్యపల్లిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. టుజ్జ రాజేశ్వరరావు, సరోజన దంపతులకు కొడుకు నాగేందర్, కూతురు స్వాతి. రెండేళ్ల క్రితం కూతురు పెళ్లి చేశారు. పెళ్లికి చేసిన అప్పును తీర్చడం కోసం తండ్రీకొడుకులు గతేడాది ఎకరంలో బోరు కింద మిర్చి సాగు చేశారు.
లాభం రావడంతో ఈ ఏడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాడు. మిర్చికి సరైన ధర లేకపోవడంతో తండ్రి తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో కొడుకుపై కుటుంబ భారం పడింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురైన నాగేందర్రావు బుధవారం సాయంత్రం చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చీకటి పడటం ఎవరూ గమనించలేదు. కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లి గురువారం ఉదయం వెతికినా కనిపించలేదు. చివరకు మిర్చి చేనులో నాగేందర్రావు మృతదేహాన్ని గమనించిన రైతులు కుటుంబ సభ్యులకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి స్థానిక ఎస్ఐ చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
మహిళా హెడ్కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్, వెస్ట్(సుబేదారి) మహిళా పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న జమున గురువారం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. జమున తన వద్ద ఉన్న గాజు ముక్కలతో రెండు చేతులపై గీసుకొని, మెడపై కోసుకునేందుకు ప్రయత్నించింది. చెయ్యిపై గాయాలయ్యాయి. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే కమిషనరేట్ కార్యాలయం ఆవరణలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథ¿మిక చికిత్స చేయించి ఇంటికి పంపించారు. ఈ ఘటన సంచలనం కలిగించింది.
తోటి మహిళా ఉద్యోగుల కథనం ప్రకారం... పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించే సమయంలో అధికారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మహిళలని చూడకుండా కించపరుస్తుండటంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. గతంలో ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం రాలేదన్నారు. వేధింపులు ఎక్కువ కావడంతో జమున ఆత్మహత్యాయత్నం చేసుకుందని తెలిపారు. శాంతి భద్రతలు పరిరక్షించే పోలీసులకే రక్షణ లేకుండా పోతుందని పలువురు మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.
విధులు నిర్వహించమంటే వేధింపులకు గురి చేస్తున్నామని కొంతమంది సిబ్బంది అంటున్నారు. జమునను ఎవరూ వేధించలేదు. బందోబస్తులో భాగంగా కమిషనరేట్ కార్యాలయం నుంచి మహిళా హెడ్కానిస్టేబుల్ కావాలంటే అక్కడికి పంపించాం. అక్కడికి వెళ్లాక ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుశాఖలో క్రమశిక్షణ ఉంటుంది. దానిని ఎవరు ఉల్లంఘించినా అధికారులు చర్యలు తీసుకుంటారు. మహిళలకు సంబంధించిన కేసులలో విచారణ చేయాలని చెప్పినా ఆమె వినలేదు. దరఖాస్తు తిరిగి నాకు ఇచ్చింది. మహిళా పోలీసుస్టేషన్లలో బృందాన్ని తయారు చేస్తూ అధికారులను ఇబ్బందులను గురిచేసేందుకు ప్రయత్నిస్తోంది.
పిల్లలు పుట్టలేదని భార్యను హత్య చేసిన భర్త
పిల్లలు పుట్టలేదని కట్టుకున్న భార్య రాంబాయిని భర్త హత్య చేసిన సంఘటన మండలంలోని ఇప్పల్నవెగాం కొలాంగూడలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇప్పల్నవెగాంకు చెందిన ఎరగేటి భుజంగ్రావు, రాంబాయిలు భార్యాభర్తలు. 15 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగినా పిల్లలు పుట్టలేదు. ఈ విషయంపై వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
బుధవారం మధ్యాహ్నం కూడా ఇంట్లో వీరి మధ్య గొడవ జరిగింది. మృతురాలి సోదరుడు మైసయ్య, కుటుంబ సభ్యులు బుధవారం ఇంటి సమీపంలో బంధువుల వివాహానికి వెళ్లారు. ఈ క్రమంలో చెల్లెలు, బావ గొడవపడడాన్ని గమనించారు. తరచూ వీరి మధ్య గొడవ సహజమేనని భావించి కుటుంబ సభ్యులతో వివాహానికి వెళ్లారు. తిరిగి రాత్రి చెల్లి ఇంటి వద్దకు రాగా నేలపై పడి మృతి చెంది ఉంది. దీనిని గమనించిన మైసయ్య.. తన చెల్లెలిని బావే హత్య చేశాడని.. గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్హెచ్ఓ సతీష్కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి ఘటన వివరాలు అడిగి తెలుసుకొని కేసు నమోదు చేశారు.
ఖమ్మంలో మరో ఆసుపత్రి సీజ్
లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయడంతోపాటు కనీస నిబంధనలు పాటించని ఖమ్మంలోని పలు ఆసుపత్రులపై వైద్యశాఖ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం మూడు ఆసుపత్రులను సీజ్ చేసిన వైద్యశాఖ అధికారులు, గురువారం మరో ఆసుపత్రిని సీజ్ చేసి, రెండు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. జిల్లా వైద్యశాఖ అధికారి కొండలరావు ఆధ్వర్యంలో గురువారం ఆసుపత్రుల తనిఖీకి వెళ్లగా కొన్ని ఆసుపత్రుల యజమాన్యాలు ఆయనపై బెదిరింపు ధోరణితో ప్రవర్తించారు.
ఒక ఆసుపత్రి యజమాని తన ఆసుపత్రిని సీజ్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడంతో ఆ ఆసుపత్రికి నోటీసు జారీ చేశారు. స్వాతి ఆసుపత్రిని తనిఖీ చేయగా డీఎంఅండ్హెచ్వోతో వాగ్వాదానికి దిగారు. త్రీహన ఆసుపత్రిలో అబార్షన్లు నిర్వహిస్తున్నట్టు వైద్యశాఖాధికారులు గుర్తించారు. అబార్షన్లు చేసేందుకు ఉపయోగించే ఇంజక్షన్లు కూడా లభ్యమవడంతో సీజ్ చేశారు. అనంతరం గంగోత్రి ఆసుపత్రిలో వసతులు సరిగా లేకపోవడంతో వారం రోజుల్లో వసతులు ఏర్పాటు చేయాలని నోటీసులు అందజేశారు. అనంతరం మెడినోవా, దివ్య ల్యాబ్లను తనిఖీచేశారు.