రైతులు చచ్చిం తర్వాత రద్దు చేస్తారా.?మోదీ మూల్యం చెల్లించక తప్పదన్న రేవంత్ రెడ్డి.!
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిన మూడూ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన పట్ల తెలంగాణ కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా రైతుల నుండి వ్యక్తమైన వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించినందుకు అనేక మంది రైతులు సర్వం కోల్పోయారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలు రైతు హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఎన్నో రూపాల్లో ఉద్యమాలు చేసిందని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు.
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ.. గులాబీ పార్టీ మద్దత్తు ఇచ్చిందన్న రేవంత్
అంతే కాకుండా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలలు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అకుంఠిత దీక్ష తో పోరాటం చేశారని, నరేంద్ర మోదీ ప్రభుత్వం మెడలు వంచి, మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా పోరాటం చేశారని స్పష్టం చేసారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా పోరాటం చేస్తారో, రైతులు కూడా అదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమం చేశారని వివరించారు. రైతుల స్వేఛ్చకు విఘాతం కలిగించే విధంగా వ్యవసాయ చట్టాలను కేంద్రం రూపొందించిందని, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర వ్యవసాయ చట్టాలకు మద్దత్తు ప్రకటించి రైతులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ద్రోహం చేసారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
వ్యవసాయ చట్టాకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఏనాడూ గళం విప్పలేదు.. కేసీఆర్ పై మండిపడ్డ రేవంత్
అంతే కాకుండా గుజరాత్ నుండి బయలు దేరిన నలుగురు దేశాన్ని అక్రమించుకోవాలని చూస్తున్నారని, వ్యవసాయం అదాని, అంబానీకి అమ్మకానికి పెట్టాలని చూశారని రేవంత్ రెడ్డి మండి పడ్డారు. ఐతే రైతు ఉద్యమాలకు కాంగ్రెస్ అండగా నిలబడిందని, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరుపున మొట్టమొదట పాదయాత్ర కూడా నిర్వమించానని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజున నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడాన్ని రైతుల విజయంగా భావిస్తున్నట్టు రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.
వందల ప్రాణాల పోయాక రద్దు చేస్తారా.? మోదీ నరరూప రాక్షసుడన్న రేవంత్
వ్యవసాయ చట్టాల పట్ల వ్యతిరేకత వస్తున్న తొలి నాళ్లలోనే ఈ చట్టలు వెనక్కి తీసుకుంటే రైతుల ప్రాణాలు మిగిలేవని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. వందల మంది రైతులు ప్రాణాలు పోవడానికి కేంద్ర ప్రభుత్వ వైఖరితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ మొండి పద్దతులే కారణమని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తరు. వందలాది మంది రైతుల ప్రాణాలు పోవడానికి కారణం అయిన నరరూప రాక్షసుడు మోడీ అని, దేశ వ్యప్తంగా ఉన్న రైతు కుటుంబాలు నరేంద్ర మోదీని ఎన్నటికీ క్షమించరని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
నల్ల చట్టాల రద్దు క్రెడిట్ తమదే అనడం సిగ్గుచేటు.. గులాబీ పార్టీపై రేవంత్ ఫైర్
అంతే కాకుండా తెలంగాణ శాసన సభలో కూడా లోపభూయిష్టంగా ఉన్న వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశామని, అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే లను మార్షల్స్ తో చంద్రశేఖర్ రావు బయటకు గెంటి వేయించారని రేవంత్ గుర్తు చేసారు. వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టివేయడానికి కేంద్రలో మోదీ, రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు కారణమని మండిపడ్డారు. పార్లమెంట్ లో వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా చంద్రశేఖర్ రావు ఓటేశారని రేవంత్ గుర్తు చేసారు. ఇదే పార్లమెంట్ నిండు సభలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేద్దామంటే దైర్యం లేక పారిపోయారని రేంవత్ రెడ్డి మండిపడ్డారు.