చంద్రబాబు అరెస్ట్, సీన్ ఛేంజ్ - సెటిలర్ల మద్దతెవరికి..!!
తెలంగాణలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. పార్టీలు ప్రచారానికి సిద్దం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారం ఖాయమనే ధీమాతో ఉంది. బీజేపీ తామే రేసులో ముందున్నామని చెబుతోంది. ఈ సమయంలోనే తెలంగాణలో నివసిస్తున్న ఏపీకి చెందిన సెటిటర్ల ఓట్ల లెక్కలు కీలకంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ వీరి పైన ప్రభావం ఉంటుందనే ప్రచారం ఉంది. అసలు ఏం జరుగుతోంది.
హోరా హోరీ పోరు : తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి పోటీ ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ప్రతీ సీటులోనూ ఏ ఓటు వదులుకోవటానికి పార్టీలు సిద్దంగా లేవు. ఉమ్మడి రాష్ట్రం నుంచి హైదరాబాద్..తెలంగాణ ప్రాంతంలో సెటిల్ అయిన ఆంధ్ర ప్రాంత ఓట్ల గురించి ఇప్పుడు చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన..తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బ తింది.

అయితే, ఏపీకి చెందిన ఓటర్లు మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీకి చెందిన ఓటర్ల ఆలోచన పై ఆసక్తి కర లెక్కలు బయటకు వస్తున్నాయి. సెటిలర్లు చంద్రబాబు అరెస్ట్ పైన ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నా...వైసీపీ మద్దతు దారులు ఏపీ నుంచి ఉన్న సెటిలర్లలో ఉన్నారు.
సెటిలర్లు ఎటువైపు : ప్రధానంగా హైదరాబాద్ లోని కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ వీరి ఓటింగ్ కనిపిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు.అందులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉండగా, చెప్పుకోదగిన సంఖ్యలో ఏపీ ప్రాంత వాసులు ఉన్నారు.
వారిలో చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ లోనే ఓటర్లుగా కొనసాగుతున్నారు. శేరిలింగం పల్లి, రాజేంద్రనగర్, కుకట్ పల్లి నియోజవర్గాల్లోనే 20 శాతానికి పైగా ఓటర్లుగా ఉన్నారు.ఈ నియోజకవర్గాల్లో ఐటీ ఉద్యోగుల ఓట్లు కీలకంగా మారతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి వీరిలో మెజార్టీ సంఖ్యలో బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నారు.

ప్రభావం ఉంటుందా : అయితే, స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తో హైదరాబాద్ లోని సెటిలర్ల ఆలోచన మారిందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు వారంతా సిద్దంగా ఉన్నారంటూ కొందరు టీవీ ఛానళ్ల ముందుకు వచ్చి మరీ చెబుతున్నారు. ఇక్కడ రేవంత్ గతంలో టీడీపీకి పని చేసి ఉండటంతో....ఇప్పుడు టీడీపీ ఓటర్లు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బీఆర్ఎస్ పాలనకే వారంతా మద్దతుగా ఉంటారనేది ఆ పార్టీ నేతల అంచనా. చంద్రబాబు అరెస్ట్ విషయంలోనూ బీఆర్ఎస్ నేతలు కొద్ది రోజులుగా స్పందిస్తున్నారు.
తాజాగా లోకేశ్ కు అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఇవ్వటం వెనుక ఈ ఓటింగ్ అంశమే ప్రధాన కారణమనే చర్చ సాగుతోంది.తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా..చేస్తే ఎన్ని స్థానాలకు చేస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది. జనసేన 32 స్థానాల్లో పోటీకి సిద్దమని ప్రకటించింది. ఇక్కడ ఎవరితో ఎవరికి పొత్తు ఉంటుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, అసలు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తెలంగాణలో ప్రభావం చూపిస్తుందా..ఎవరికి అనుకూలంగా ఉంటుందా..ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందనేది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications