రేప్ ఘటనలపై సీఎం కేసీఆర్ స్పందించరా? వారి వీపులు త్వరలోనే పగలగొడతారు: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మార్కాపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో ఐదు రోజుల కిందట అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను బిజెపి రాష్ట్ర మహిళా నాయకులతో కలిసి పరామర్శించిన బండి సంజయ్ ఆపై తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
ఎన్టీఆర్ నగర్లో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన క్రమంలో బండి సంజయ్ ను కలిసిన స్థానిక మహిళలు నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూడాలని డిమాండ్ చేశారు. తమకు కావాల్సింది ఓదార్పు కాదు, ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక మహిళలు కోరారు. నిందితుడు శిక్ష తప్పించుకుని బయటకు వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. ఇక బండి సంజయ్ దోషులకు శిక్ష పడేవరకు పోరాటం చేద్దామని స్థానిక మహిళలతో పేర్కొన్నారు.
అత్యాచారాలకు పాల్పడుతున్న ఎంఐఎం, టిఆర్ఎస్ పార్టీ నాయకులు వీపులను ప్రజలు త్వరలోనే పగలగొడతారంటూ బండి సంజయ్ హెచ్చరికలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ వద్ద జరిగిన సంఘటన పై టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించక పోవడం వల్లనే రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు. అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించకపోవడం సిగ్గుచేటని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వం అత్యాచారానికి పాల్పడిన దుండగుల పట్ల కఠినంగా వ్యవహరించడం లేదని, వారికి రక్షణ కల్పిస్తుందని బండి సంజయ్ ఆరోపించారు.
అత్యాచారాలకు సంబంధించిన సంఘటనలను మీడియా, ప్రజలు వెలుగులోకి తీసుకొస్తుంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. అమ్నీషియా పబ్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన తరువాత, కార్ఖానాలోనూ అత్యాచార ఘటన జరిగిందని, ఎంఐఎం ఇలాంటి ఘటనకు పాల్పడిందని, దోషులను కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే అధికార టీఆర్ఎస్ పాలనకు ప్రజలు త్వరలో చరమగీతం పాడతారన్నారు బండి సంజయ్ .