గవర్నర్ తమిళిసై మహిళా దర్బార్ సక్సెస్ అవుతుందా? సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుందా? ఆసక్తికరచర్చ!!
రాజ్ భవన్ సంప్రదాయానికి భిన్నంగా జూన్ 10న శుక్రవారం నాడు రాజ్భవన్లో మహిళల సమస్యలను తెలుసుకోవడానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 'మహిళా దర్బార్' నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అత్యాచార ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహించాలని తీసుకున్న చొరవ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ మహిళా దర్బార్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నేడే గవర్నర్ తమిళి సై మహిళా దర్బార్
జనవరిలో ప్రజాదర్బార్ నిర్వహించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు. ఇక ప్రస్తుతం ప్రజాదర్బార్లో భాగంగా జూన్ 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్ 10వ తేదీ మధ్యాహ్నం 1 గంటల వరకు రాజ్భవన్లో మహిళల సమస్యలను తెలుసుకోవడానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 'మహిళా దర్బార్' నిర్వహిస్తున్నారు. గవర్నర్ను వచ్చి కలవాలనుకునే మహిళలు 040-23310521కు కాల్ చేయడం ద్వారా లేదా rajbhavan-hydgov.inకు ఈమెయిల్ చేయడం ద్వారా అపాయింట్మెంట్ పొందాలని ఇప్పటికే ప్రకటన చేశారు.
తమిళిసై ప్రజా దర్బార్ పై ప్రభుత్వ వర్గాలలో భిన్నాభిప్రాయం
మహిళల సమస్యలను నేరుగా వింటా.. వారి సమస్యలను పరిష్కరిస్తా అంటున్న గవర్నర్ తమిళిసై ఆలోచనతో చాలా మంది మహిళలు రాజ్ భవన్ లో తమ సమస్యలను చెప్పుకోడానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ మేరకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలతో రాజ్ భవన్ లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ గవర్నర్లు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు నేరుగా తీసుకున్న సందర్భాలు లేవని, ఇక ఇప్పుడు ప్రజాదర్బార్ నిర్వహించి గవర్నర్ నేరుగా ప్రజల దగ్గర నుంచి సమస్యలు స్వీకరిస్తే ప్రజలు ప్రభుత్వంపై చెడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాలలో ఉంది.
మహిళల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందా?
చాలా కాలం నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు మధ్య వివాదాలు కొనసాగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారిక వర్గాలు గవర్నర్ నిర్వహించే మహిళా దర్బార్ కు ఏ మేరకు సహకరిస్తారు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహిళల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించడం కోసం తన వంతు కృషి చేస్తానని చెబుతున్న తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వర్గాలతో పని చేయించగలుగుతారా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది.
ప్రభుత్వ అధికారులు సహకరించకుంటే తమిళి సై ఏం చేస్తారు? ఆసక్తికర చర్చ
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని, ప్రభుత్వం సహకరించకపోతే తమిళిసై చేస్తున్న ఈ మహిళా దర్బార్ ప్రయత్నం విఫలమవుతుంది అన్న భావన వ్యక్తమవుతోంది. ఈ గవర్నర్ తమిళిసై కి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి, ఆయా సమస్యలను పరిష్కరిస్తే, మహిళల్లో, రాష్ట్ర ప్రజల్లో తమిళిసై కి ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు సహకరించే పరిస్థితి లేదు అన్న అభిప్రాయమే పలువురిలో వ్యక్తమవుతోంది. మరి నేడు జరగనున్న మహిళా దర్బార్ లో మహిళా సమస్యలపై తమిళిసై ఏం చేయబోతున్నారు? ముందుముందు ఏం జరగబోతోంది? అన్నది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.