ఎన్నికల వేళ కేసీఆర్ వ్యూహం ఓట్లు రాల్చేనా - ఆ వర్గాలే టార్గెట్..!?
ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక ప్రతిపాదనలతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఓట్ బ్యాంక్ పైన ఫోకస్ చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం 2023-24 బడ్జెట్ ప్రతిపాదించింది. సంక్షేమానికి భారీ ప్రాధాన్యత ఇచ్చింది. దళితబంధు - రైతు బంధు కోసం భారీగా నిధులు కేటాయించింది. డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేటాయింపులు పెంచింది. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు ఆర్దిక సాయం ప్రకటించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఇలా..పలు నిర్ణయాలతో ఓట్ బ్యాంక్ పై బడ్జెట్ తో గురి పెట్టింది. కేంద్రం చూపిస్తున్న వివక్షను ప్రస్తావిస్తూనే.. తాము వెనక్కు తగ్గేది లేదని ప్రభుత్వం బడ్జెట్ లో తేల్చి చెప్పింది. మరి ఈ బడ్జెట్ ఎన్నికల వేళ అధికార పార్టీకి ఓట్లు తెచ్చి పెడుతుందా...వ్యూహం ఫలిస్తుందా..

ఎన్నికల ఏడాది భారీ బడ్జెట్ తో...
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..తెలంగాణ ప్రభుత్వం 2023-24 బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ. 37,525 కోట్లు అని వెల్లడించారు. ఇక వ్యవసాయం, నీటిపారుదల, విద్యా, వైద్య రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్ లో ప్రధానంగా ఎన్నికల హామీలు..రానున్న రోజుల్లో ప్రజలను దగ్గర చేసే పథకాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు కనిపిస్తోది. ముఖ్యమంత్రి మానస పుత్రిక దళిత బంధుకు అధికారికంగా బడ్జెట్ లో రూ 17,700 కోట్లు కేటాయించారు. అదే విధంగా.. రైతు బంధుకు రూ 5 వేల కోట్ల మేర నిధులు కేటాయించారు. ప్రభుత్వం డుబల్ బెడ్ రూం పథకానికి ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకోసం రూ 12 వేల కోట్ల మేర నిధులను ప్రతిపాదించారు.

సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు
ఈ బడ్జెట్ లో మరో కీలక నిర్ణయం ప్రకటించారు. సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దీనికోసం రూ.7,890 కోట్లు కేటాయించినట్టు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో 2 వేల మందికి రూ.3 లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. సీఎం కోటాలో 25వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మొత్తంగా 2 లక్షల 63 వేల మందికి 7890 కోట్లు అందించనున్నట్టు పేర్కొన్నారు. ఇక డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ.12వేల కోట్లు కేటాయించారు. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, దళితబంధు పథకాలకు భారీగా నిధులు కేటాయించింది.

సంక్షేమం - వ్యవసాయానికి పెద్దపీట
ఎన్నికల వేళ బడ్జెట్ లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రైతులకు సంబంధించి రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు కేటాయింపులు చేసారు. రైతుబందు పథకానికి రూ. 15,075 కోట్లు, రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఇక.. సంక్షేమ రంగంలో చూస్తే దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు కేటాయింపులు చేసారు. మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు., ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు ప్రతిపాదించారు. మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు కేటాయించారు. ఇక, ఈ సారి బడ్జెట్ లో గిరిజన సంక్షేమం గురించి మంత్రి హరీష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు ప్రతిపాదించారు. గిరిజన సంక్షేమానికి తీసుకున్న చర్యలను వివరించారు. మరి..ఇప్పుడు ఈ కేటాయింపులు రానున్న కొత్త ఆర్దిక సంవత్సరం లో అమలు ద్వారా ఎన్నికలకు మరింతగా ప్రజలకు చేరవయ్యేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.












Click it and Unblock the Notifications