రాజకీయాల్లోకి కోదండ, కానీ ఇప్పుడే కాదు!: మంత్రి పద్మారావ్ ట్విస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ రాజకీయాల్లోకి వస్తారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. గురువారం నాడు పద్మారావు చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ రాజకీయాల్లోకి రానున్నారని ఆయన బాంబు పేల్చారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జెఏసి కీలక పాత్ర పోషించిందని ఆయన చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోదండరాంను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినట్లు చెప్పారు. అయితే, ఆయన తెలంగాణ సమాజం బాగుపడ్డ తర్వాతనే రాజకీయాల్లోకి వస్తానని చెప్పారని అన్నారు. తమ ప్రభుత్వం కోదండరాం ఆశయాలకు అనుగుణంగా పని చేస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జెఏసి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. జెఏసి చైర్మన్గా కోదండరామ్... ఉద్యమంలో అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లారు. ఉద్యమంలో జెఏసి పాత్ర ఎనలేనిది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆయన రాజకీయాల్లోకి రావొచ్చనే ప్రచారం జరిగినప్పటికీ, ఆయన రాలేదు.