కాబోయే సీఎం కేటీఆరే..? వరంగల్ పర్యటనలో సంకేతాలు..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అంటూ ఇటీవల పలువురు మంత్రులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే మరో పదేళ్లు కేసీఆరే సీఎం అంటూ కేటీఆర్ ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. కానీ కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలకు మాత్రం తెరపడటం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం వరంగల్ పర్యటనలో కేటీఆర్ కోసం జరిగిన ఏర్పాట్లు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి స్థాయిలో కేటీఆర్కు ఏర్పాట్లు జరిగాయని, ఆయనే కాబోయే సీఎం అనడానికి ఇదే సంకేతం అన్న ప్రచారం జరుగుతోంది.
సీఎం తరహాలో ఏర్పాట్లు
మంత్రి కేటీఆర్ మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్లో అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే భద్రత రీత్యా రోప్ టీమ్ను కూడా ఏర్పాటు చేశారు. సాధారణంగా మంత్రుల కాన్వాయ్లో అంబులెన్స్ ఉండదు, రోప్ టీమ్స్ను కూడా ఎక్కువగా ముఖ్యమంత్రుల కోసమే వాడుతుంటారు. ఇక కేటీఆర్కు స్వాగతం పలికేందుకు నిట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు జిల్లాకు చెందిన నేతలంతా క్యూ కట్టారు. మీడియాకు సైతం ఎంట్రీ పాసులను అందజేశారు. ఇదంతా చూస్తుంటే కేటీఆర్కు ముఖ్యమంత్రి కళ వచ్చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాబోయే సీఎం కేటీఆరేనా..?
కేసీఆర్ తర్వాత తెలంగాణకు కేటీఆరే ముఖ్యమంత్రి అని ఇటీవల పలు సందర్భాల్లో మంత్రులు ఎర్రబెల్లి,శ్రీనివాస్ గౌడ్లు వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ మాత్రం ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. మరో పదేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. కేటీఆర్ పైకి అలా చెబుతున్నప్పటికీ.. తెర వెనుక మాత్రం ఆయన్ను సీఎం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
అప్పట్లోనే ప్రచారం
నిజానికి గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. కేటీఆర్ను సీఎం చేసేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న వాదన వినిపించింది. అయితే ఎన్నికల తర్వాత అలాంటిదేమీ జరగలేదు. రెండోసారి కేసీఆరే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే రెండో దఫా కేసీఆర్ పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగకపోవచ్చునని,మధ్యలోనే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఐటీ కంపెనీల ప్రారంభం..
వరంగల్ పర్యటనలో కేటీఆర్ మడికొండ పారిశ్రామిక ప్రాంతంలో టెక్ మహీంద్రా,సైయెంట్ ఐటీ వంటి పలు కంపెనీలను ప్రారంభించారు. ఇదే ఏడాదిలో కరీంనగర్,ఖమ్మం జిల్లా కేంద్రాల్లోనూ ఐటీ హబ్లను ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. అలాగే నిజమాబాద్,మహబూబ్ నగర్,నల్లగొండ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలకూ పారిశ్రామిక అభివృద్దిని విస్తరిస్తామని స్పష్టం చేశారు.