మించిపోతున్న తరుణం: రైతుకు అందని పంట రుణాలు
ఖరీఫ్ సీజన్ మొదలై 21 రోజులైంది. ఒక వైపు వర్షాలు పడుతున్నా పంట రుణాల పంపిణీ నత్తనడకన సాగుతున్నది. దీంతో అన్నదాతలు ఇబ్బందుల పాలవుతున్నారు.
హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ మొదలై 21 రోజులైంది. ఒక వైపు వర్షాలు పడుతున్నా పంట రుణాల పంపిణీ నత్తనడకన సాగుతున్నది. దీంతో అన్నదాతలు ఇబ్బందుల పాలవుతున్నారు. మూడేళ్లుగా రుణమాఫీ నిధులు రాలేదన్న సాకుతో వానాకాలం సీజన్లో పంటరుణాలు ఇవ్వకుండా బ్యాంకులు రైతులను వేధించేవి.
ఈసారి అలాంటి సాకులు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చివరి విడత నిధులు గతనెలలోనే బ్యాంకులకు విడుదల చేసింది. కొన్ని బ్యాంకులే రైతుల ఖాతాల్లో జమచేశాయి. అయినా రుణాలిచ్చే విషయమై జాప్యం చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు పంటరుణాలెన్ని ఇస్తారన్న విషయమై 'వార్షిక రుణ ప్రణాళిక'ను ఇంతవరకూ రాష్ట్ర బ్యాంకర్ల సమితి విడుదల చేయలేదు.
వాస్తవంగానైతే సీజన్కు ముందే బ్యాంకర్ల రాష్ట్రస్థాయి సమావేశంలో లక్ష్యాలు నిర్దేశించుకుని నిధులు విడుదల చేయాలి. ఈ నెల 12న జరుగుతుందని ప్రకటించి తిరిగి 23కు వాయిదా వేశారు. గతేడాది ఖరీఫ్లో రూ.18,500 కోట్లను పంటరుణాలిస్తామని, సెప్టెంబర్ నాటికి 23 లక్షల మందికి రూ.15,705 కోట్లే ఇచ్చారు.
మిగిలిన సొమ్మును రబీ సీజన్ సమయంలో ఇచ్చినట్లు బ్యాంకులు తెలిపాయి. ఈ ఖరీఫ్ సీజన్లో రూ.23,573 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పటికి రూ.2,573 కోట్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రుణమాఫీ నిధులు 33 లక్షల మంది రైతులకు ప్రభుత్వం విడుదల చేసింది. వీరందరికీ పంట రుణాలివ్వాలి. కనీసం గతేడాది ఖరీఫ్ రుణం తీసుకున్న 23 లక్షల మందికైనా వెంటనే ఇవ్వాలి.
ఏటీఎం కేంద్రాల్లో నగదు కొరతతో ఇబ్బంది
పలు గ్రామాల్లోని బ్యాంకులు రుణాల పంపిణీని ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు. ఈ నెల ప్రారంభంలో ఆడిట్ జరుగుతుందని రైతులను రానివ్వలేదు. ఇప్పుడు వాణిజ్య బ్యాంకులకు వెళితే సర్వర్లు పనిచేయడం లేదని, సిబ్బంది లేరంటున్నారని రైతులు వాపోతున్నారు. కొన్ని చోట్ల రైతులకు రుణమిచ్చినా నగదు విడుదల చేయడం లేదు. రైతు ఖాతాలో జమచేశామని, ఏటీఎం కార్డులతో తీసుకోవాలని చెబుతున్నారు.
తీరా ఏటీఎం కేంద్రాలకు వెళితే నగదు రాక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది పంటరుణం తీసుకున్న రైతులందరినీ పంటలబీమా పరిధిలోకి తేవాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయశాఖకు తెలిపారు. వచ్చేనెల తొమ్మిదో తేదీ నాటికి మిర్చి పంటకు, వచ్చే నెల 15వ తేదీ నాటికి పత్తికి బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగుస్తోంది. రుణాలే ఇవ్వకుంటే ఇక రైతుల బీమా పరిధిలోకి ఎలా వస్తారన్నది వ్యవసాయశాఖకే తెలియాలని రైతులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రుణాలివ్వడానికి బ్యాంకుల సాకులు ఇలా
గతేడాది జూన్లో రూ.1.20 లక్షల రుణం తీసుకుని ఐదెకరాల్లో ఆముదం, కంది సాగుచేస్తే రూ.70 వేల నష్టం వచ్చిందని వనపర్తి జిల్లా కొత్తకోట వాసి వేముల శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పుడు రుణం కోసం బ్యాంకుకెళితే కొద్దిరోజులు ఆగమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 10 ఎకరాల భూమి ఉన్నదని, బ్యాంకుకు వెళితేరుణం ఇస్తామన్నారని ఖమ్మం జిల్లా చిరుమర్రి గ్రామం నివాసి కొడాలి కృష్ణారావు తెలిపారు. కానీ నగదు దొరకడం లేదని, సిబ్బంది లేరని రుణాలివ్వడంలో ఆలస్యం చేస్తున్నారని వాపోయారు.