కరోనా విలయం: మళ్లీ పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా గాంధీ, ఇతర ఓపీ సేవలు బంద్
తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతున్నది. కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి మరోసారి పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా మారనుంది.
కరోనా వైరస్ తొలి వేవ్ సందర్భంలో గాంధీని కొవిడ్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చడం, మధ్యలో కేసులు తగ్గడంతో సాధారణ ఆస్పత్రి స్థాయికి మార్చి, అన్ని రకాల ఓపీ సేవలను కొనసాగించారు. అయితే, ఇప్పుడు రెండో వేవ్ దెబ్బకు గాంధీ మళ్లీ పూర్తి స్థాయిలో గాంధీలో కొవిడ్ సేవలు అందించనున్నారు.
కొవిడ్ ఆస్పత్రిగా గాంధీని మార్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీలో శనివారం నుంచి నాన్ కోవిడ్ రోగాల ఓపీ సేవలు నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు, ఎమర్జెన్సీ ఆపరేషన్స్ను కూడా ఆపేసి కేవలం కరోనా కేసులకు మాత్రమే చికిత్స అందిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అచ్చెన్నకు హోం శాఖ ఖరారు -పార్టీ మార్పుపై విజయసాయిరెడ్డి క్లారిటీ -గురుమూర్తి నిఖార్సైన హిందువు
గాంధీలో ఇప్పటికే 450 మందికి పైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 150మంది ఆస్పత్రిలో చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఐపీ బ్లాక్ మొత్తం ఇప్పటికే కొవిడ్ పేషెంట్స్తో నిండిపోయిందని.. ప్రతి 10 నిమిషాలకు ఒక కరోనా పేషెంట్ గాంధీలో చేరుతున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం నాటి బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,840 పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,885కు, మరణాల సంఖ్య 1,797కు పెరిగింది. ప్రస్తుతం 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 20,215 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా వచ్చినవాటిలో 510 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కావడం గమనార్హం.