ఆరుగురు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం
మహబూబ్నగర్: ఆరుగురు పిల్లలకు ఎలుకుల మందు తాగించి తల్లి కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్ మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఖాజాబేగం తన కుటుంబ సభ్యులతో జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైంది.
తరచూ అత్త వేధిస్తుండంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని రాజాపూర్ గ్రామంలో ఎలుకల మందు కొనుగోలు చేసి అక్కడి నుండి తన ఆరుగురు పిల్లలను వెంటబెట్టుకుని భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన గల దర్గా సమీపంలో తన ఆరుగురు పిల్లలకు శీతలపానీయంలో ఎలుకల మందు కలిపి తాగించి తాను కూడా దానిని సేవించింది.
దర్గా దగ్గర నుండి పక్కనే ఉన్న ముస్లింల శ్మశానవాటిక దగ్గరకు వారిని తీసుకుకొని తల్లి ఖాజాబేగం వెళ్లింది. అప్పటికే ఎలుకల మందు కారణంగా విష ప్రభావానికి గురైన ఆరుగురు చిన్నారులు మహిమూద(8) హబీబా(6) సబా(4) హషిన్(3) మస్తాన్(2) నవాజ్(1) శ్మశానవాటికలో వాంతులు చేసుకుంటూ కిందపడి గిలగిల కొట్టుకున్నారు.
అటుగా వ్యవసాయ పనులు ముగించుకుని గ్రామంలోకి వస్తున్న రైతులు తల్లి, పిల్లల దీన స్థితిని చూసి సమాచారాన్ని అన్నాసాగర్ పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటీన చేరుకుని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అరుగురు పిల్లలను, తల్లిని వెంటనే అంబులెన్స్ ద్వారా మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న తల్లి, ఆరుగురు పిల్లల్లో రెండేళ్ల బాలుడు మస్తాన్ పరిస్థితి విషమంగా మారింది. విషయం తెలిసిన వెంటనే జడ్చర్ల సిఐ గిరిబాబు జిల్లా ఆసుపత్రికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రకాశ్యాదవ్ తెలిపారు.
అత్తతో జరిగిన గొడవ వల్లే ఖాజాబేగం ఈ దుర్ఘటనకు పాల్పడిందని సిఐ గిరిబాబు తెలిపారు. భర్త ఖాసీంను పిలిపించి జరిగిన ఘటనపై విచారణ జరిపారు. కాగా ఖాజాబేగం తను చనిపోతే తనపిల్లలను చూసుకునేవారే ఉండరని వారికి కూడా ఎలుకల మందు తాగించి ఉండవచ్చని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.