ఒంటరితనంతో స్త్రీ ఆత్మహత్య, భార్యపై అనుమానంతో..
హైదరాబాద్: తనతో మాట్లాడే వారు లేరని, ఒంటరితనాన్ని భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన సరోజ, వెంకటేష్ దంపతులు. వెంకటేష్ ఆర్టీసీ డ్రైవర్. వీరు కొంతకాలంగా ముషీరాబాదు పోలీసు స్టేషన్ పరిధిలో ఉంటున్నారు.
వీరి తనయుడు అదిలాబాదులో చదువుకుంటున్నాడు. కూతురు ముషీరాబాదులోనే ఓ పాఠశాలలో చదువుతోంది. వీరు మూడు నెలల క్రితం దగ్గరలోని మరో పెంట్ హౌస్కు మారారు. భర్త ఉద్యోగానికి, కూతురు పాఠశాలకు వెళ్లడంతో.. సరోజ ఒంటరిగా ఉంటోంది.
దీంతో, తనతో మాట్లాడేందుకు ఎవరు లేరని, గురువారం నాడు పడక గదిలోని సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరేసుకుంది. మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చిన కూతురు ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి తలుపు తెరిచి చూడగా, ఆత్మహత్య చేసుకొని కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అనుమానంతో భార్యపై దాడి చేసిన భర్త
భార్యపై అతడికి అనుమానంతో ఓ భర్త దాడికి పాల్పడ్డాడు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడ్డ సదరు భార్య ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఎల్లయ్య, రేణుకలు భార్యాభర్తలు. కుమారుడు ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్ కారుకు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఎల్లయ్య కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు.
ఆమె తమ దూరపు బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నదని అతడి ఆరోపణ. కొంతకాలంగా తన ఆరోగ్యం కూడా బాగుండడం లేదని, అర్థరాత్రి నిద్రలో లేచి ఎటో వెళ్లిపోతున్నానని, శరీరంపై దద్దుర్లు వస్తున్నాయని, దీనికి తన భార్యే కారణమని, ఆమె తనకు బాణామతి చేయించిందని ఎల్లయ్య అనుమానించాడు.
ఈ అనుమానాల నేపథ్యంలో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం రేణుక ఇంటి ముందు గిన్నెలు తోముతుండగా, వెనుక నుంచి పొడవాటి కత్తితో ఎల్లయ్య ఆమెపై దాడి చేశాడు. సుత్తి, ఇనుపరాడ్డుతోనూ విచక్షణారహితంగా కొట్టాడు. దాంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఎల్లయ్య తన తలపై సుత్తితో కొట్టుకుని గాయాలు చేసుకున్నాడు. స్థానికులు గమనించి ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications