చైన్ స్నాచర్ దుర్మార్గం: సుమిత్ర మృతి, కెసిఆర్దే బాధ్యతన్న కిషన్
హైదరాబాద్: గొలుసు దొంగ చేతిలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ విషాధ సంఘటన ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. బర్కత్ పురాకు చెందిన సుమిత్ర ఈ నెల 17వ తేదీనా లాలాగూడ నుంచి ఓయు మీదుగా కొడుకుతో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్తోంది.
ఆ సమయంలో ఓ దొంగ బైక్ పైన వచ్చి సుమిత్ర మెడలో నుంచి సుమారు రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఈ సమయంలో సుమిత్ర బైక్ పైనుంచి కిందపడింది. ఆమె తలకు తీవ్ర గాయమైంది. దీంతో, ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె శుక్రవారం కన్నుమూశారు.
సుమిత్ర పెద్ద కుమారుడు వంశీ డిగ్రీ పూర్తి చేశాడు. చిన్న కొడుకు నల్లకుంటలోని కళాశాలలో ఎంబీయే తొలి సంవత్సరం చదువుతున్నాడు. కూతురు కోమల్ కాచిగూడలోని నృపతుంగా డిగ్రీ కాలేజీలో ఫస్టియర్ చదువుతోంది.

పట్టపగలే సుమిత్ర మెడలో నుంచి బంగారు గొలుసు లాగడమే కాకుండా ఆమెను నెట్టవేసి మృతికి కారకుడైన దొంగ పైన పోలీసులు ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సుమిత్ర మృతితో బర్కత్ పురలో విషాదం నెలకొంది. ఆమె భర్త శ్రీహరి.
శ్రీహరి తార్నాకలోని ఎన్ఐఎన్లో అటెండర్గా పని చేసేవాడు. అతనికి పెరాలసిస్ రావడంతో అతని స్థానంలో సుమిత్ర పని చేస్తోంది.
సుమిత్ర కుటుంబాన్ని పరామర్శించిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్

సుమిత్ర కుటుంబాన్ని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్లు పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. మహిళల రక్షణ కోసం ఎంతో చేస్తున్నామని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమవుతోందన్నారు.
గొలుసు దొంగ దాడిలో ప్రాణఅాలు కోల్పోయిన నిరుపేద కుటుంబానికి చెందిన సుమిత్ర మృతికి రాష్ట్ర ప్రభుత్వం, కెసిఆర్ బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. అసెంబ్లీలో మహిళల భద్రత అంశాన్ని లేవనెత్తుతామన్నారు.












Click it and Unblock the Notifications