'ఈమె'తో జాగ్రత్త: కేపీహెచ్బీ పోలీసుల హెచ్చరిక, ఆచూకీ చెబితే రూ.25వేల నజరానా!
హైదరాబాద్: బ్యూటీ పార్లర్లలో మేకప్ చేయించుకునేందుకు వెళ్లి.. నిర్వాహకులనే బురిడీ కొట్టిస్తున్న ఓ మాయాలేడీ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. నగలతో ఉడాయిస్తున్న ఆ మహిళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేపీహెచ్బీ పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇద్దరు బ్యూటీపార్లర్స్ నిర్వాహకులను ఆమె బురిడీ కొట్టించింది.
ఎవరామె?:
కేపీహెచ్బీ కాలనీ 6వఫేజ్లో మాధురీ బ్యూటీ పార్లర్ ఉంది. ఇటీవల ఓ మహిళ మరో మహిళతో కలిసి ఆ పార్లర్ వెళ్లింది. మేకప్ చేస్తున్న సమయంలో.. ఒంటిపై బంగారం ధరించకూడదని బ్యుటీషియన్ కు ఆమె సూచించింది. దీంతో బ్యుటీషియన్, పార్లర్ నిర్వాహకురాలైన ఆ మహిళ.. ఒంటి మీద నగలు తీసి పార్లర్ అల్మారాలో పెట్టింది.
మాటల్లో పెట్టి బోల్తా..:
నగలను అల్మారాలో పెట్టిన తర్వాత బ్యుటీషియన్ సదరు మహిళకు మేకప్ చేసింది. ఆపై బ్యుటీషియన్ ని మాటల్లో పెట్టిన సదరు మహిళ.. ఏవో మత్తు బిళ్లలు ఇవ్వడంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో అల్మారాలో దాచిన నగలతో వారిద్దరూ ఉడాయించారు.
నిజాంపేటోలనూ ఇలాగే..:
నిజాంపేటలోని ఓ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలిని కూడా సదరు కిలేడీ ఇలాగే బోల్తా కొట్టించింది. మేకప్ చేయించుకోవాలన్న నెపంతో.. పార్లర్ కి వెళ్లిన ఆ లేడీ.. నిర్వాహకురాలిని మాటల్లో పెట్టి మాయ చేసింది. ఆమె ఆభరణాలతో అక్కడినుంచి ఉడాయించింది. ఇటీవల కేపీహెచ్బీ పోలీసు స్టేషన్ పరిదిలో ఈ తరహా ఘటనలు పునరావృతమవడంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఆచూకీ చెబితే నజరానా..:
బ్యూటీ పార్లర్స్ లో చోరీలకు పాల్పడుతున్న మహిళ చిత్రాన్ని తాజాగా పోలీసులు విడుదల చేశారు. ఆ మాయలేడి వివరాలు తెలిపినవారికి రూ.25వేల నజరానా ఇస్తామని ప్రకటించారు. బ్యూటీ పార్లర్ల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, సదరు కిలేడీ ఎక్కడైనా కనిపిస్తే ప్రజలు సమాచారం అందించాలని చెబుతున్నారు.