కరోనా: దహన సంస్కారాల్లో అనూహ్య ఘటన.. తండ్రి చితిపై దూకేసిన కూతురు... ఆస్పత్రిలో చావు బతుకుల్లో..
కరోనా మిగులుస్తున్న విషాదం అంతా ఇంతా కాదు... మనిషిని మనిషికి కాకుండా చేస్తోన్న ఈ మహమ్మారి వైరస్ మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తోంది... తోబుట్టువులను,కన్నవాళ్లను,ఆత్మీయులను దూరం చేస్తూ వేల మందికి తీరని విషాదాలను మిగులుస్తోంది... కళ్లముందే అయినవాళ్లు శ్మశానికి చేరుతుంటే... ఆ వేదన వర్ణణాతీతం... తాజాగా రాజస్తాన్లో జరిగిన ఓ ఘటన కరోనా వేళ నెలకొన్న విషాద పరిస్థితులను కళ్లకు కడుతోంది...
అనూహ్య ఘటన...
రాజస్తాన్లోని బర్మర్ జిల్లాకు చెందిన దామోదర్ దాస్ శార్దా(73) మంగళవారం(మే 4) కోవిడ్తో మరణించారు. శ్మశాన వాటికలో అతని మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దామోదర్ దాస్ కూతురు చంద్ర శార్దా(34) ఒక్కసారిగా చితిపై దూకేసింది. వెంటనే అక్కడున్నవారు ఆమెను చితి నుంచి పక్కకు తప్పించినప్పటికీ... అప్పటికే ఆమె శరీరం 70శాతం మేర కాలిపోయింది. హుటాహుటిన ఆమెను సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం జోధ్పూర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
స్థానికుల కంటతడి..
ఈ ఘటనపై స్థానిక పోలీస్ అధికారి ప్రేమ్ ప్రకాశ్ మాట్లాడుతూ... 'కోవిడ్తో మృతి చెందిన దామోదర్ దాస్ శార్దాకు ముగ్గురు కుమార్తెలు. ఆయన భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. మంగళవారం దామోదర్ దాస్ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా చిన్న కుమార్తె చంద్ర ఒక్కసారిగా చితిపై దూకేసింది.ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.' అని తెలిపారు. తండ్రిపై ఉన్న అమితమైన ప్రేమ... ఆయన ఇక లేరన్న చేదు నిజాన్ని భరించలేక ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఏపీలోనూ హృదయవిదారకర ఘటన...
కరోనా వేళ ఎటుచూసినా ఇలాంటి విషాద దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోనూ ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిన అసిరి నాయుడు(44) అనే వ్యక్తి కుటుంబ సభ్యుల ముందే కుప్పకూలి శ్వాస ఆడక మృతి చెందాడు. అసిరి నాయుడు కిందపడిపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో... దగ్గరికి వెళ్లేందుకు ఆయన భార్య కూడా సాహసించలేదు. తల్లి అడ్డు చెబుతున్నా కూతురు మాత్రం అతని దగ్గరికి వెళ్లి నోట్లో గుక్కెడు నీళ్లు పోసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను మృతి చెందాడు. ఈ హృదయ విదారకర ఘటన చాలామందిని కంటతడి పెట్టించింది. మానవ సంబంధాలను కరోనా ఎంతలా విచ్ఛిన్నం చేస్తుందో ఈ ఘటన ద్వారా అర్థమవుతోంది.
Recommended Video