కన్న కొడుకునే గొడ్డలితో నరికి చంపిన తల్లి: ఎందుకు?
నిజామాబాద్: నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కన్న కొడుకునే ఓ తల్లి మనసు రాయి చేసుకుని హత్య చేసింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చందూరు గ్రామంలో సోమవారంనాడు జరిగింది.
గ్రామానికి చెందిన మేకల నవీన్ (30) మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. మద్యానికి బానిసైన నవీన్ ఇటీవలి కాలంలో పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. తాగుడుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని వేధిస్తూ వస్తున్నాడు.
డబ్బులివ్వాలని ఆదివారం రాత్రి నవీన్ ఇబ్బంది పెట్టాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని ఆమె చెప్పింది. దీంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిన నవీన్ సోమవారం తెల్లవారు జామున తిరిగి ఇంటికి వచ్చి తల్లి దాచుకున్న డబ్బులు తీసుకన్నాడు. ఉదయం లేచి చూసేసరికి డబ్బులు లేవని గమనించి తల్లి కుమారుడిని ప్రశ్నించింది.
దాంతో అతను తల్లితో గొడవ పడ్డాడు. విసుగెత్తిన తల్లి ఆగ్రహంతో గొడ్డలితో అతనిపై దాడి చేసింది. మంచడం మీద పడుకుని ఉన్న సమయంలో గొడ్డలితో మెడ భాగంలో దాడి చేయడంతో నవీన్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.