భర్త ఇంట్లోనే ఉన్నాడు: రజనీ పిల్లలద్దరినీ చంపేసి బెంగళూర్ చెక్కేసే యత్నం
హైదరాబాద్: సికింద్రాబాద్లోని అడ్డగుట్ట టీచర్స్ కాలనీలో బుధవారం రాత్రి తల్లి రజనీ తన ఇద్దరు కూతుళ్లను చంపిన ఘటనపై పలు మలుపులు తిరుగుతోంది. భర్త వినయ్ తన పెద్ద కూతురు అవిష్క (7)ను లైంగిక వేధిస్తున్నాడనే అనుమానమే రజనీ చేత హత్యలు చేయించిందని అంటున్నారు.
తండ్రి అఘాయిత్యమంటూ హత్య: పిల్లల శవాలు చూడ్డానికి రజనీ నో
రజని(40), వినయ్ దంపతులకు అవిష్క(7), తవిష్క(3) అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు. వీరు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందినవారు. కొంత కాలంగా హైదరాబాదులో ఉంటున్నారు. వినయ్ ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తున్నాడు.
బుధవారం రాత్రి హత్యలు జరిగిన సమయంలో వినయ్ ఇంట్లోనే ఉన్నాడు. పిల్లలకు పాఠాలు చెబుతానని తీసుకుని వెళ్లి వారిని గుట్టు చప్పుడు కాకుండా రజనీ చంపేసింది. పిల్లల చడీ చప్పుడు వినిపించకపోవడంతో వినయ్ గదిలోకి వెళ్లి చూసే సరికి పిల్లలిద్దరు రక్తం మడుగులో బాత్రూంలో పడి ఉన్నారు. సీసా పగలగొట్టి ఉంది. తల్లి రజని మాత్రం అప్పుడక్కడ కన్పించలేదు.
పిల్లలిద్దరినీ చంపిన తర్వాత రజనీ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందనే వార్తల్లో కూడా నిజం లేదని తెలుస్తోంది. బెంగుళూరు వెళ్లే ప్రయత్నంలో ఉండగా పోలీసులు ఆమెను సికింద్రాబాదులోని ప్యారడైజ్ వద్ద గుర్తించి పట్టుకున్నట్లు తెలుస్తోంది.
పిల్లలను చంపిన తర్వాత కూడా రజనీలో ఏ విధమైన బాధా కనిపించలేదు. పిల్లల శవాలను చూడడానికి కూడా ఆమె ఇష్టపడలేదు. కొంత కాలంగా పెద్ద కూతురు తండ్రిని చూస్తేనే వణికిపోతోందని రజనీ పోలీసు విచారణలో తెలిపింది. లైంగికంగా వేధిస్తుండడం వల్లనే తండ్రిని చూసి తన కూతురు భయపడుతోందని తాను అనుమానించినట్లు రజనీ చెప్పింది.
భార్యాభర్తల మధ్య కొంత కాలంగా గొడవలు చెలరేగుతున్నట్లు సమాచారం. ఈ గొడవలకు కారణం కూడా భర్తపై రజనీకి ఉన్న అనుమానమేనని చెబుతున్నారు. అయితే, రజనీ అనుమానమేనని చెబుతోందని, అయితే అందులో ఏ మేరకు నిజం ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు అంటున్నారు. రజనీని పోలీసులు అరెస్టు చేయగా, వినయ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కూతురి పట్ల వ్యవహరిస్తున్న తీరుపై రజనీ భర్తను అడిగిందని, తానేమీ అనుచితంగా ప్రవర్తించడం లేదని వినయ్ చెప్పినా ఆమె నమ్మలేదని అంటున్నారు. ఇలాగే వదిలేస్తే అమ్మాయిని తన భర్త ఏమైనా చేస్తాడేమోననే అనుమానం రజనీని వేధించినట్లు చెబుతున్నారు. కూతురిని తన భర్త లైంగికంగా వేధిస్తున్నాడనేది తన అనుమానమేనని, దానికి సాక్ష్యాలు కూడా ఏమీ లేవని రజనీ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.