దుర్గాదేవి చనిపోమందని పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్న మహిళ
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కలలో కనిపించిన దుర్గామాత చెప్పిందని ఓ మహిళ పెట్రోల్ పోసి ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈరోజు ఉదయం 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో అత్తాపూర్ 133వ పిల్లర్ వద్ద గుర్తుతెలియని మహిళ తగలబడుతూ అక్కడ స్థానికులకు కనిపించింది. వెంటనే అక్కడి వారు మహిళ కాలిపోతుందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి వెళ్లి మహిళను రక్షించే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్న కారణంగా ఆమె తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే మొదట ఎవరైనా మహిళను హతమార్చడానికి పెట్రోల్ పోసి నిప్పంట్టించారేమో అని అనుమానించిన పోలీసులు, సదరు మహిళను ప్రశ్నించిన తర్వాత ఆమెనే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నట్టుగా గుర్తించారు.

ఇక పోలీసులు అడిగిన ప్రశ్నలకు అందరూ షాకయ్యేలా అనేక విషయాలు చెప్పింది సదరు మహిళ. తన పేరు శివాని అని, తన వయసు 38 సంవత్సరాలు అని పేర్కొంది. తనకు ఒక కూతురు, తల్లి కూడా ఉన్నారని చెప్పింది. తాము సాయి బాబా దేవాలయం సమీపంలో ఉంటామని బిక్షాటన చేసి జీవనం సాగిస్తామని పోలీసులకు వెల్లడించింది. అయితే తాజాగా తనకు కలలో కాళికాదేవి కనిపించిందని చనిపో అని చెప్పిందని పేర్కొంది. అందుకే కాళికా దేవి ఆజ్ఞ మేరకు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నానని సదరు మహిళ వెల్లడించింది.
అయితే మహిళ నివసించే ప్రాంతంలో స్థానికంగా ఉన్నవారు మహిళ గత కొద్ది రోజులుగా మతిస్థిమితం సరిగా లేక బాధ పడుతుందని పోలీసులకు చెప్పారు. దీంతో మహిళ ఈ దారుణానికి మతిస్థిమితం లేకనే పాల్పడిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక తీవ్ర గాయాల పాలైన మహిళ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోంది.












Click it and Unblock the Notifications