బిడ్డను కిడ్నాప్ చేసి.. మహిళను రమ్మని నగ్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్, రేప్
హైదరాబాద్: మంథనిలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కోల్పోయి ఇద్దరు బిడ్డలతో ఒంటరిగా బతుకువెళ్లదీస్తున్న ఓ మహిళను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వేధించిన వ్యక్తి పలుకుబడి ఉన్నవాడిగా తెలుస్తోంది.
ఆమె బిడ్డను కిడ్నాప్ చేసి, బిడ్డ కావాలంటే తన వద్దకు రావాలని చెప్పి, ఆమె రాగానే నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో, చివరకు హైకోర్టును ఆశ్రయించడంతో బుధవారం ఈ దారుణం వెలుగు చూసింది.
భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటున్న మహిళకు వేధింపు
సదరి మహిళ తన భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో కలిసి మంథనిలో ఉంటోంది. అక్కడే ఉండే ప్రతాప్ అనే వ్యక్తి కోరిక తీర్చమని ఆమెను నిత్యం వేధించేవాడు. ఆమె తిరస్కరించేది. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమె బిడ్డను కిడ్నాప్ చేశాడు. బిడ్డను కిడ్నాప్ చేశానని, తన వద్దకు వస్తే ఇస్తానని చెప్పాడు.
బిడ్డను కిడ్నాప్ చేసి, నగ్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్
బిడ్డను తీసుకోవడానికి ఆమె వెళ్లింది. కానీ అతను బాధితురాలిని బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని బాధితురాలికి చూపించి, బ్లాక్ మెయిల్ చేసి ఇరవై రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
రూ.3 లక్షలతో రాజీ కుదుర్చుకోమని ఒత్తిడి
అయితే పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదట. రూ.3 లక్షలు తీసుకొని రాజీ కుదుర్చుకోవాలని నిందితుడు... బాధితురాలికి చెప్పాడు. ఆమె తగ్గలేదు. ఫిర్యాదు చేసినా వారు కూడా అదే మంచిదని చెప్పారని తెలుస్తోంది. పలుకుబడి కలిగిన వ్యక్తి కాబట్టి ఆ డబ్బు తీసుకొని రాజీకి రావాలని చెప్పాడని తెలుస్తోంది.
బయట చెప్తే పరువుపోతుందని, హైకోర్టుకు
బయటకు చెబితే నీ పరువే పోతుందని, కాబట్టి డబ్బు తీసుకొని సర్దుకుపోవాలని నిందితుడు పదేపదే హెచ్చరించాడని తెలుస్తోంది. దీంతో అక్కడ న్యాయం జరగకపోయేసరికి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె పిటిషన్ దాఖలు చేయడంతో విషయం వెలుగు చూసింది.