మహిళపై అత్యాచారం ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించారు, మెట్రో పనుల్లో అపశృతి
హైదరాబాద్: మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం నాగారం గ్రామంలో గురువారం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నాగారం గ్రామానికి చెందిన కొంతమంది పశువుల కాపరులు గ్రామంలోని రాజాగారి తోటలో పశువుల మేతకు వెళ్లారు. కాగా, అక్కడ మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళపై అత్యాచారం చేసి ఆపై పెట్రోలు పోసి నిప్పంటించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. అనంతరం మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టంలో పూర్తి వివరాలు తెలిస్తాయని తెలిపారు.
మెట్రో పనుల్లో అపశృతి
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మెట్రో పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. గురువారం మెట్రో నిర్మాణ పనుల్లో పని చేస్తున్న కూలీ ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అమీర్ పేట చెన్నై షాపింగ్ మాల్ సమీపంలో చోటు చేసుకుంది.
సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన చెన్నమనాయుడు (38)గా గుర్తించారు.
మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా కార్మికుడు మృతి చెందిన విషయాన్ని పోలీసులు మెట్రో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.