మహిళా టెక్కీ ఆత్మహత్య: భర్త వేధింపులా? షేర్ మార్కెట్లో నష్టపోయిన భర్త
హైదరాబాద్: ఓ మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారంలో ఆదివారం వెలుగు చూసింది.
స్థానికంగా ఉంటున్న ఇరవై అయిదేళ్ల వినీల ఓ ప్రయివేటు కంపెనీలో సాఫ్టువేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె ఆదివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
భర్త వేదింపుల వల్లే వినీల ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
వినీల భర్త విక్రమ్ ఆమెను వేధించాడని బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వినీల ఏడేళ్ల క్రితం హైదరాబాదుకు చెందిన విక్రంను పెళ్లి చేసుకున్నారు.
వీరికి అయిదేళ్ళ, మూడేళ్ల వయస్సు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. విక్రమ్ షేర్ మార్కెట్లో నష్టపోయినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.