వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో యాదాద్రి ఆలయానికి స్థానం!!
తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత అద్భుతంగా వెయ్యేళ్లు చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అలనాటి వైభవం చెక్కుచెదరకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి యాదాద్రి ఆలయాన్ని ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా నిర్మించారు.ఇప్పటివరకు ఏ ఆలయంలోనూ లేని విధంగా పూర్తిగా నల్లరాతి కృష్ణ శిలలతో నిర్మించిన ఏకైక ఆలయం యాదాద్రి ఆలయం కావడం విశేషం.
యాదాద్రి ఆలయంలో గుళ్ళూ, గోపురాలు మాత్రమే కాదు ఆలయ ప్రాకారాలు కూడా కృష్ణ శిలలతో నిర్మించారు. యాదాద్రి ఆలయ నిర్మాణానికి మొత్తం రెండు లక్షల టన్నుల నల్ల రాతిని వాడారు. చోళ, పల్లవ, హొయసల, కాకతీయ శిల్ప శైలులు అన్నింటిని రంగరించి, కొత్త శైలిలో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించారు. యాదాద్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సరికొత్త శిల్పకళా చరిత్రకు నాంది పలికారు.

ఈ క్రమంలో ఆ యాదాద్రి ఆలయం ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది. తాజాగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. యాదగిరిగుట్ట పై నాలుగు సంవత్సరాల కాలంలోనే 4.3 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణ శిలలతో, ఏడు అంతస్తుల రాజగోపురం తోపాటు, సప్త గోపురాలు నాలుగు ప్రాకారాలతో కలిసి స్వామివారి ప్రధాన ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు.
ఈ మేరకు ఈ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి లభించిన ఈ గుర్తింపు సంబంధించిన సర్టిఫికెట్ ను తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవం నాడు ఆలయ ఈవో గీతారెడ్డికి ఆ సంస్థ ప్రతినిధులు అందించారు.
తెలంగాణా తిరుమలగా, ఏపీలో తిరుమలకు దీటుగా తెలంగాణా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన నేపధ్యంలో అరుదైన ఈ ఘనత సాధించింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications