యాదాద్రి ఆలయ పునఃప్రారంభం: స్వామి పల్లకీ మోసి; మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న సీఎం కేసీఆర్
ఆరేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యాదాద్రిలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కరణ జరుగుతోంది. స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మి నరసింహుడు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ నవ వైకుంఠాన్ని చూపించేలా యాదాద్రి ఆలయాన్ని అత్యంత అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు. అణువణువునా ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా, ఆహ్లాదాన్ని పంచేలా యాదాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. యాదాద్రి లోకి ప్రవేశించగానే ఓం నమో నారసింహాయ అంటూ భక్తులందరిలో భక్తిభావం పెంపొందేలా అద్భుత కళాఖండంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి గోచరిస్తుంది.
యాదాద్రి ఆలయ పునఃప్రారంభ తొలిపూజల్లో కేసీఆర్ కుటుంబం
బేగంపేట విమానాశ్రయం నుండి యాదాద్రికి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళిన కేసీఆర్ దంపతులు యాదాద్రిలో ఆలయ పున ప్రారంభం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలలో పాల్గొంటున్నారు. యాదాద్రి ఆలయ పున ప్రారంభం పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వయంభూ అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని తొలి దర్శనం చేసుకుంటారు ముఖ్యమంత్రి దంపతులు. అనంతరం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నుండి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
యాదాద్రి ఆలయ పునః ప్రారంభంలో పాల్గొంటున్న కేసీఆర్ కుటుంబం
సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి అంతర్జాతీయ ఖ్యాతిని గడించేలా నిర్మాణం చేసిన యాదాద్రి ఆలయ పునఃప్రారంభ అపురూప ఘట్టం నేడు కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ దంపతులు లక్ష్మీ నరసింహ స్వామి స్వయం భూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ తో పాటు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంత్రి హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, విప్ గొంగడి సునీత తదితరులు యాదాద్రికి చేరుకుని అక్కడి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
స్వామివారి పల్లకి మోసి శోభాయాత్రలో కేసీఆర్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి శోభాయాత్రలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుండి మహా పూర్ణాహుతి తో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి. బాలాలయంలోని స్వామి, అమ్మవార్ల ప్రతిష్ట మూర్తులతో నిర్వహించిన శోభాయాత్రలో, సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభా, మంత్రుల బృందం పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య శోభాయాత్ర వైభవంగా జరగగా సీఎం కేసీఆర్ ప్రధానాలయ పంచతల రాజగోపురం వద్ద స్వయంగా పల్లకిని మోసి ఆయనలో ఉన్న భక్తి భావాన్ని చాటుకున్నారు.
మహా కుంభ సంప్రోక్షణలో పాల్గొన్న సీఎం కేసీఆర్
ఆపై సప్త రాజగోపురాల కళాశాల వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ దివ్య విమాన గోపురం, సుదర్శన చక్రం వద్ద మహాకుంభ సంప్రోక్షణ లో సీఎం కేసీఆర్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు.దివ్య విమానం పై ఉన్న సుదర్శన చక్రానికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలతో కేసీఆర్ దంపతులు అభిషేకం నిర్వహించారు. సుదర్శన స్వర్ణ చక్రానికి యాగ జలాలతో సీఎం కేసీఆర్ సంప్రోక్షణ చేశారు. యాదాద్రి లో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం పునర్నిర్మాణం అనంతరం తొలుతగా సీఎం కేసీఆర్ దంపతులు చేసుకోనున్నారు.